తాగునీటి ఎద్దడిని తీర్చేందుకు ప్రత్యేక ఏర్పాట్లు
అడవుల్లో నీటి వనరుల వద్ద నిరంతర పెట్రోలింగ్
వలలు, ఉచ్చులు వేసే వేటగాళ్లపై నిశితంగా నిఘా
హైదరాబాద్, ఏప్రిల్ 3 : వేసవిలో వన్యప్రాణులకు తగినంత నీటిని అందించడమే కాకుండా వేటగాళ్ల బారి నుంచి వాటిని కాపాడేందుకు అటవీ శాఖ అధికారులు పటిష్ఠ చర్యలు చేపడుతున్నారు. వన్యప్రాణులను వేటాడేందుకు ప్రయత్నించే వారిపై ప్రత్యేక నిఘా పెట్టాలని, అడవుల్లోని నీటి గుంటలను క్షుణ్ణంగా పరిశీలించాలని క్షేత్రస్థాయి అధికారులను ఆదేశించారు. నిరంతరం పెట్రోలింగ్ నిర్వహించాలని, నీటి గుంటల వద్ద వలలు, ఉచ్చులు, విద్యుత్తు తీగలేమైనా ఉంటే వెంటనే తొలగించాలని స్పష్టం చేశారు. నైరుతి రుతుపవనాలు ప్రారంభమ య్యే వరకు ఈ ఆదేశాలను కచ్చితంగా పాటించాలని సర్క్యులర్లు జారీ చేశారు.
వన్యప్రాణులు సంచరించే ప్రాంతాల్లో అడుగడుగునా ట్రాకింగ్, ఇతర రక్షణ ఏర్పాట్లు చేయాలని స్పష్టంచేశారు. వేసవిలో నీటి వనరులు ఎండిపోవడంతో వన్యప్రాణులు అడవుల నుం చి బయటకు వస్తున్నట్టు సమాచారం ఉన్నదని, ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రతి గ్రిడ్లో కనీసం 2 కి.మీ. వ్యాసార్థం కలిగిన నీటి వనరును ఏర్పాటు చేయాలని సూచించారు. గతంలో నిర్మించిన సాసర్ల (గుంటల)లో నీటిని నింపాలని, అవసరమైతే ట్యాం కర్ల ద్వారా నీరు రవాణా చేయాలని తెలిపారు.