హనుమకొండ, ఏప్రిల్ 9 : ఆరుగాలం కష్టపడి పండించిన పంటలను కొనుగోలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రైతన్నల నడ్డివిరుస్తున్నదని ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ, శాసన మండలి సమావేశాల్లో మకజొన్న రైతులను ఆదుకోవాలని, మద్దతు ధర కల్పించాలని బీఆర్ఎస్ ఒత్తిడి చేసినప్పటికీ ప్రభుత్వం స్పందించడం లేదని విమర్శించారు. గురువారం హనుమకొండ బాల సముద్రంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు దాస్యం వినయ్భాస్కర్తో కలిసి మీడియాతో మాట్లాడారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో 3 లక్షల ఎకరాల్లో మక్కజొన్న సాగు చేయగా, రాష్ట్ర వ్యాప్తంగా 15 లక్షల ఎకరాల్లో సాగు అయినట్టు చెప్పారు. పోర్టల్లో నమోదు చేస్తేనే మక్క జొన్న పంటను కొనుగోలు చేస్తామనడంపై ఆందోళన వ్యక్తంచేశారు. కాళేశ్వరం నుంచి నీటిని ఎత్తిపోయకపోవడం వల్ల ఎల్ఎండీ ఎండిపోయే పరిస్థితి నెలకొన్నదని, మూడు జిల్లాల్లో తాగు, సాగు నీటి కొరత ఏర్పడుతున్నదని చెప్పారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిస్సహాయ స్థితిలో ఉన్నదని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. 420 హామీలు, 6 గ్యారెంటీలతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చి వాటి అమలును పూర్తిగా మరచిపోయిందని విమర్శించారు. ఉద్యోగులు, కార్మికులు, ఆశా వరర్లు, అంగన్వాడీ సిబ్బంది, ఆర్టీసీ ఉద్యోగులకు ఇచ్చిన హామీలను రెండున్నరేండ్లు దాటినా అమలు చేయలేదని మండిపడ్డారు. విద్యుత్తు రంగాన్ని కేసీఆర్ దేశంలోనే అగ్రస్థానంలో నిలిపిన విషయాన్ని గుర్తుచేశారు.
కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు విద్యుత్తు శాఖలోని 26 వేల మంది ఆర్టిజన్లను పర్మినెంట్ చేసి జీతాలు పెంచినట్టు చెప్పారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీలో స్థానికులకు 80 శాతం ఉద్యోగాలు కల్పించాలని, భూ నిర్వాసిత కుటుంబాలకు ఉద్యోగాలు ఇవ్వాలని, కాజీపేటను డివిజన్గా ప్రకటించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో కుడా మాజీ చైర్మన్ యాదవరెడ్డి పాల్గొన్నారు.