పైసా ఖర్చు కాలే.. ఉల్టా కేసీఆర్ కిట్ ఇచ్చిన్రు
అమ్మ ఒడి వాహనంలో ఇంటికాడ దింపిన్రు
మంత్రి హరీశ్రావుకు సిరిసిల్లవాసి లేఖ
హైదరాబాద్, జూలై 5 (నమస్తే తెలంగాణ): ‘సారు.. మీరు చెప్పినట్టే నా బిడ్డకు సర్కారు దవాఖానల నార్మల్ డెలివరీ చేయించిన’ అని తెలుపుతూ రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన పోచయ్య అనే వ్యక్తి వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావుకు లేఖ రాశారు. దవాఖానలో వసతులు బాగున్నాయని, ఒక్క రూపాయి కూడా ఖర్చు కాలేదని చెప్పారు. అమ్మ ఒడి వాహనంలో తన బిడ్డను, మనుమడిని ఇంటివద్ద దింపారని తెలిపారు. తనకు జరిగిన మంచి పది మందికి తెలియాలని ఈ లేఖ రాస్తున్నట్టు పోచయ్య పేర్కొన్నారు. ఆయన రాసిన లేఖ యథాతథంగా.. ‘సారు.. మాది రాజన్న సిరిసిల్ల జిల్లా చింతల్ ఠాణా ఆర్ అండ్ ఆర్ కాలనీ. కేసీఆర్ సారు వల్ల మంచిగ వసతులు ఉన్నాయని నా బిడ్డను కాన్పు కోసం సిరిసిల్ల గవర్నమెంట్ దవాఖానకు తీసుకపోయిన. మా కేటీఆర్ సారు ఆసుపత్రిలో మంచి సౌలత్లు ఏర్పాటు చేసిండు. ఏప్రిల్ 10 నాడు నా బిడ్డ పురిటినొప్పులతో బాధపడుతుంటే మా తమ్మునికి ఫోన్ చేసిన. సాధారణ కాన్పు అయితే తల్లి, బిడ్డకు మంచిదని చెప్పిండు.
డాక్టర్లు కూడా కొద్దిగా ఓపిక పట్టు అన్నరు. టీవీల్లో మీరు (మంత్రి హరీశ్రావు) సాధారణ కాన్పు వల్ల కలిగే మంచి గురించి చెప్పిన్రు. మేము కూడా నార్మల్ డెలివరీ చేయాలని దవాఖానల చెప్పినం. డాక్లర్లు నా బిడ్డకు నార్మల్ డెలివరీ చేసిన్రు. పండంటి మగబిడ్డ పుట్టిండు. నా బిడ్డ, మనుమడు ఆరోగ్యంగా ఉన్నారు. పైసా ఖర్చు కాలేదు. పైగా కేసీఆర్ కిట్ ఇచ్చిన్రు. పైసా తీసుకోకుండా అమ్మ ఒడి వాహనంలో ఇంటికాడ దింపిండ్రు. కడుపుకోతలు నివారించేందుకు మీరు (మంత్రి హరీశ్రావు) పడుతున్న కష్టం చూస్తున్న. నాకు, నా బిడ్డకు, మనుమడికి కలిగిన మేలు అందరికీ తెలువాలన్న ఉద్దేశంతో మీకు కృతజ్ఞతలు తెలుపుతూ ఈ లేఖ రాయించి పంపుతున్నాను సార్. నాకు జరిగిన మేలే అందరికీ జరుగాలె’ అని ఆ లేఖలో పోచయ్య, వసంత వివరించారు.
సాధారణ కాన్పులకు చైతన్యం.. ఈ ఉత్తరం
సిరిసిల్ల ప్రభుత్వ దవాఖానలో నార్మల్ డెలివరీ చేయించుకొని దవాఖానలో సేవలను ప్రశంసిస్తూ పోచయ్య రాసిన ఉత్తరం నాకు అందింది. సాధారణ కాన్పు ద్వారా తనకు జరిగిన మేలు అందరికీ తెలియాలన్న ఒక మంచి సందేశం ఇవ్వడం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఈ ఉత్తరం ప్రజల్లో ముఖ్యంగా మహిళల్లో గొప్ప చైతన్యం నింపుతుంది. వసంత (పోచయ్య కుమార్తె) నిండునూరేండ్లు పిల్లపాపాలతో వర్ధిల్లాలి.
– మంత్రి హరీశ్రావు