కరీంనగర్ కార్పొరేషన్, ఆగస్టు 9: అర్హులందరికీ గృహలక్ష్మి పథకం వర్తింపజేస్తామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ఇప్పటికే చాలామంది నిరుపేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టించి ఇచ్చామని అన్నారు. సొంత జాగా ఉండి ఇల్లు నిర్మించుకోవాలనే వారికి రూ. 3 లక్షల సాయం చేస్తామని చెప్పారు. బుధవారం కరీంనగర్ కలెక్టరేట్లో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్తో కలిసి గృహలక్ష్మి, దళితబంధు, బీసీ కులవృత్తులకు చేయూత, సబ్సిడీ గొర్రెల పంపిణీ పథకాల అమలుపై సమీక్ష నిర్వహించారు. అనంతరం మంత్రి గంగుల మాట్లాడుతూ గృహలక్ష్మి పథకం నిరంతర ప్రక్రియ అని చెప్పారు. స్లాబ్ ఇల్లు ఉన్నవారు జీవో 59 కింద లబ్ధిపొందిన వారు ఈ పథకానికి అనర్హులని అన్నారు. గృహలక్ష్మి కోసం ప్రత్యేక దరఖాస్తు ఫారం అంటూ ఏదీ లేదని, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫారంతో ప్రభుత్వానికి సంబంధం లేదని స్పష్టం చేశారు. తెల్లకాగితంపై దరఖాస్తు రాసి, ఆహార భద్రత కార్డు, ఆధార్ కార్డు, ఓటర్ ఐడీ కార్డుతో కలిపి గ్రామాల్లో తహసీల్దార్, పట్టణ ప్రాంతాల్లో మున్సిపాలిటీల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. లబ్ధిదారుల ఎంపిక జిల్లా మంత్రి, కలెక్టర్ పర్యవేక్షణలో జరుగుతుందని చెప్పారు. గృహలక్ష్మి పథకం అమలు కోసం తెలంగాణ ప్రభుత్వం నియోజకవర్గానికి ఒక నోడల్ ఆఫీసర్ను, మండలానికి ఒక స్పెషల్ విచారణాధికారిని నియమించిందని తెలిపారు. గురువారం వరకు దరఖాస్తులు స్వీకరించి, 20లోగా లబ్ధిదారుల విచారణ పూర్తి చేస్తామని చెప్పారు. 25న మొదటి విడత లబ్ధ్దిదారులకు అందిస్తామని అన్నారు. లబ్ధిదారుల్లో ఎస్సీలు 20 శాతం, ఎస్టీలు 10, బీసీలు 50 శాతం, వికలాంగులు 5 శాతం మించకుండా ఉండేలా చూసుకోవాలని అధికారులకు సూచించారు. సమావేశంలో మండలి విప్ పాడి కౌశిక్రెడ్డి, కలెక్టర్ బీ గోపి, న్యాఫ్స్కాబ్ చైర్మన్ కొడూరి రవీందర్రావు తదితరులు పాల్గొన్నారు.