ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ వెల్లడి
మహబూబ్నగర్ టౌన్, జూలై 6: ‘మన ఊరు-మనబడి’ పథకం కింద రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం రూ.7,500 కోట్లు కేటాయించిందని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. ఇందులో భాగంగా అదనపు తరగతి గదులతోపాటు కిచెన్ షెడ్, టాయిలెట్లు తదితర సౌకర్యాలు కల్పించనున్నట్టు చెప్పారు.
బుధవారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని క్రిస్టియన్పల్లిలోని ఎంవీఎస్ డిగ్రీ కళాశాలలో రూ.3.20 కోట్లతో అదనపు తరగతి గదుల నిర్మాణానికి భూమి పూజ, టీడీగుట్ట హైస్కూల్లో రూ.32 లక్షల వ్యయంతో నిర్మించిన అదనపు తరగతి గదులను ప్రారంభించారు. టీడీగుట్ట పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. భవిష్యత్తులో తెలంగాణ పథకాలు దేశవ్యాప్తంగా అమలు కానున్నాయని తెలిపారు. మధ్యాహ్న భోజనం మెనూ అమలులో నిర్లక్ష్యం వహిస్తే, ఆహారంలో నాణ్యత లోపిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.