హెచ్ఎండీఏ పరిధిలో రూ.334 కోట్లు
ఇప్పటివరకు 90 శాతం ప్లాట్ల అమ్మకం
హైదరాబాద్, మార్చి 17 : రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో వేలానికి పెట్టిన ప్రభుత్వ భూములు హాట్కేకుల్లా అమ్ముడుపోయాయి. ఈ నెల 14న ప్రారంభమైన ఈ-వేలం పాటకు అనూహ్య స్పందన లభించింది. భూముల అమ్మకాల ద్వారా ప్రభుత్వానికి అంచనాలకు మించి రూ.567.24 కోట్ల ఆదాయం సమకూరింది. ఇందులో అత్యధికంగా రూ.334 కోట్లు హెచ్ఎండీఏ పరిధిలోనే వచ్చింది. జిల్లాల్లో రూ.232 కోట్ల ఆదాయం లభించింది. హెచ్ఎండీఏ పరిధిలోని బహదూర్పల్లి, తొర్రూరుతోపాటు నల్లగొండ, మహబూబ్నగర్, జోగులాంబ గద్వాల, కామారెడ్డి, పెద్దపల్లి, ఆదిలాబాద్, వికారాబాద్ జిల్లాలో ప్రభుత్వం అభివృద్ధి చేసిన ప్లాట్లను అమ్మకానికి పెట్టింది. 1,356 ప్లాట్లను విక్రయించాలని నిర్ణయించగా గురువారం నాటికి మూడ్రోజుల్లో 1,227 ప్లాట్లు అమ్ముడు పోయాయి. ఇంకా 129 ప్లాట్లు అమ్ముడుపోవాల్సి ఉన్నది. పెద్దపల్లి, ఆదిలాబాద్, మహబూబ్నగర్ జిల్లాల్లో 100 శాతం అమ్మకాలు నమోదయ్యాయి.