హైదరాబాద్, జనవరి 26 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం సమాజంలోని అన్ని వర్గాలకు స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు అందిస్తుందని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ఆశాభావం వ్యక్తం చేశారు. గణతంత్ర వేడుకల్లో భాగంగా శుక్రవారం హైదరాబాద్లోని పబ్లిక్ గార్డెన్స్లో గవర్నర్ జాతీయ పతకాన్ని ఆవిష్కరించారు. త్రివిధ దళాల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం ఆమె ప్రసంగించారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలను నెరవేర్చే కార్యాచరణ మొదలైందని, మహాలక్ష్మి పథకంలో ఇప్పటి వరకు 11 కోట్ల పైబడి మహిళలు ఉచిత బస్సు సౌకర్యాన్ని వినియోగించుకున్నారని చెప్పారు. మిగిలిన గ్యారెంటీలను కూడా వంద రోజుల్లో అమలు చేస్తారని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. ఏ ప్రభుత్వమైనా రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా పాలన సాగించినప్పుడే ప్రజాస్వామ్య, సంక్షేమ, అభివృద్ధి ఫలాలు ప్రతి పేదవాడికి అందుతాయని అన్నారు.
అభివృద్ధిలో తెలంగాణ ప్రపంచంతో పోటీ పడేలా, సంక్షేమంలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించేలా రేవంత్రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం పట్టుదలతో ముందుకు సాగాలని చెప్పారు. టీఎస్పీఎస్సీ ద్వారా త్వరలోనే ప్రభుత్వ ఉద్యోగ ఖాళీల భర్తీ ప్రక్రియ మొదలవుతుందని పేర్కొన్నారు. ఈ విషయంలో యువత ఎలాంటి అనుమానాలు, అపోహలకు లోను కావాల్సిన అవసరం లేదన్నారు. దావోస్కు వెళ్లి భారీ స్థాయిలో పెట్టుబడులు తీసుకొచ్చిన సీఎం రేవంత్రెడ్డి బృందాన్ని అభినందించారు.
ప్రజల హకులను, స్వేచ్ఛను గౌరవించే పాలన తెలంగాణలో ఉంది అని చెప్పారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, దుద్దిళ్ల శ్రీధర్బాబు, కొమటిరెడ్డి వెంకట్రెడ్డి, పొన్నం ప్రభాకర్గౌడ్, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీఎస్ శాంతికుమారి, డీజీపీ రవిగుప్తా, నగర కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్రెడ్డి, పలువురు న్యాయమూర్తులు, ఇతర ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు పాల్గొన్నారు.