Governor Tamilisai | హైదరాబాద్, ఫిబ్రవరి 8(నమస్తే తెలంగాణ): తమ ప్రభుత్వం నిర్దిష్ట సమయంలోపు ఆరు గ్యారెంటీలను అమలు చేస్తుందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తెలిపారు. టీఎస్పీఎస్సీ ద్వారా దాదాపు రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పారు. బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా గవర్నర్ గురువారం ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. రైతుభరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, యువ వికాసం, చేయూత అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఇ ప్పటికే రెండు గ్యారెంటీలను అమలు చేశామని, త్వరలోనే మరో రెండు గ్యారెంటీలు రూ.500కే గ్యాస్, 200 యూనిట్ల ఉచిత గృహ విద్యుత్తు పథకాలను అమలు చేయబోతున్నట్టు చెప్పారు. ఇటీవలి ప్రజా పాల న కార్యక్రమంలో 1.28 కోట్ల దరఖాస్తులు వచ్చాయని తెలిపారు.
హైదరాబాద్ గత వైభవాన్ని పునరుద్ధరించాల్సి ఉన్నదని, రాష్ట్రమంతటా అభివృద్ధిని వికేంద్రీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. పారిశ్రామిక, సేవారంగాల వృద్ధికి నూతన విధానాన్ని ప్రవేశపెట్టాలని భావిస్తున్నట్టు తెలిపారు. చిన్న పారిశ్రామికవేత్తల బలోపేతానికి నూతన ఎంఎస్ఎంఈ పాలసీని తీసుకురానున్నట్టు వెల్లడించారు. వెయ్యి నుంచి మూడు వేల ఎకరాల విస్తీర్ణంలో రాష్ట్రవ్యాప్తంగా 10 నుంచి 12 ఫార్మా విలేజ్ క్లస్టర్ల ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. దావోస్ పర్యటనలో తమ ప్రభుత్వం రూ.40వేల కోట్లకు పైగా పెట్టుబడులను రాబట్టినట్టు తెలిపారు. కృత్రిమ మేధను మరింత వినియోగించుకొనేందు కు రాష్ట్రంలో 50 నుంచి 100 ఎకరాల్లో ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ’ని ఏర్పా టు చేస్తున్నట్టు తెలిపారు.
విద్యుత్తు ఉత్పాదక వ్యయాన్ని తగ్గించేందుకు సౌర, పవన విద్యుత్తును ప్రోత్సహిస్తామని, ఇందుకు ప్రత్యేక ఇంధన పాలసీని తీసుకురానున్నామని చెప్పారు. రూ. 2వేల కోట్లతో ప్రభు త్వ ఐటీలను ఆధునిక టెక్నాలజీ సెంటర్లుగా మార్చబోతున్నామని అన్నారు. మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధికి చర్యలు చేపట్టామన్నారు. సామాజికవర్గాల వారీగా న్యాయం చేసేందుకు రాష్ట్రంలో కులగణన చేపట్టాలని నిర్ణయించామని తెలిపారు. బ డ్జెట్ వార్షిక మొక్కుబడి ఆర్థిక పత్రం కాదని గుర్తుంచుకోవాలని, ఆశించిన అభివృద్ధికి అనుగుణంగా కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకున్న ప్రజల ఆకాంక్షాలను ప్రతిఫలింపజేస్తుందని తెలిపారు. ప్రజాకవి కాళోజిజీ పద్యంతో తన ప్రసంగాన్ని ప్రారంభించిన గవర్నర్ తమిళ కవి సుబ్రహ్మణ్య భారతి సూక్తితో ముగించారు.
గవర్నర్ తమిళిసై ప్రసంగంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆమె ప్రసంగిస్తున్న సమయంలో ఫాల్స్ ఫాల్స్(అతా తప్పు తప్పు) అంటూ పలుమార్లు నినాదాలు చేశారు. ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని గవర్నర్ చెప్తుండగా.. ‘అది అంతా ఫాల్స్ ఫాల్స్’ అంటూ హరీశ్రావుతో పాటు మరికొందరు నినాదాలు చేశారు. అదే విధంగా త్వరలోనే రెండు గ్యారెంటీలను అమలు చేస్తామని గవర్నర్ ప్రకటించగా.. మిగిలిన హామీల అమలు ఎప్పుడంటూ ప్రశ్నించారు. గత సెషన్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై తమ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసిందని గవర్నర్ తెలపగానే అదంతా ఫాల్స్ ఫాల్స్ అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నినదించారు. రైతులకు రైతుభరోసా, రుణమాఫీకి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని గవర్నర్ ప్రకటించగానే.. ఇంకా రైతులకు రైతుబంధు పడలేదంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. దావోస్ పర్యటనలో రూ. 40వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయంటూ గవర్నర్ చెప్పగానే అది కూడా తప్పు తప్పు అంటూ నినాదాలు చేశారు.