హైదరాబాద్ : రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా పదవ తరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..పరీక్షలను ఒత్తిడిగా భావించకుండా ఆత్మవిశ్వాసం, సానుకూల దృక్పథంతో ముందుకు సాగాలన్నారు. పరీక్షల సమయంలో ప్రశాంతంగా ఉండి, సమయాన్ని సక్రమంగా వినియోగించుకొని తమ అత్యుత్తమ ప్రతిభను ప్రదర్శించాలని సూచించారు. ఆత్మ విశ్వాసం విజయానికి ముఖ్యమని ఆయన గుర్తు చేశారు. విద్యార్థులకు వెన్నుదన్నుగా నిలుస్తున్న తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను ఆయన ప్రశంసించారు. పరీక్షలకు హాజరవుతున్న ప్రతి విద్యార్థి మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు.
కాగా, పదో తరగతి వార్షిక పరీక్షలు ఈ నెల 14 నుంచి ప్రారంభంకానున్నాయి. పరీక్షలు శనివారం(రేపు) ప్రారంభమై.. ఏప్రిల్ 16వ తేదీ వరకు జరుగుతాయి. అయితే పరీక్షలకు ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చే విద్యార్థులను అనుమతిస్తారు. ఆ తర్వాత వచ్చే వారిని అస్సలు అనుమతించబోరు. అంటే ఉదయం 9:35 గంటల తర్వాత వచ్చే విద్యార్థులను పరీక్షకు అనుమతించబోరు. విద్యార్థులు గంట ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు. పరీక్షల నిర్వహణ కోసం రాష్ట్రవ్యాప్తంగా 2,676 సెంటర్లు ఏర్పాటు చేశారు. ప్రభుత్వ బడుల్లో 1,582 సెంటర్లు, ప్రైవేట్ బడుల్లో 1,094 సెంటర్లు ఏర్పాటు చేశారు. ఈ సారి 5,17,727 మంది విద్యార్థులు పరీక్షలు రాయబోతున్నారు.