హైదరాబాద్, ఫిబ్రవరి 3 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్కు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు సాదర స్వాగతం పలికారు. శాసనమండలి, శాసనసభ సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించడానికి గవర్నర్ శుక్రవారం 12.08 గంటలకు శాసనసభ ప్రాంగణానికి చేరుకున్నారు. ఆమెను స్వాగతించేందుకు సీఎం కేసీఆర్ స్వయంగా కారు పోర్టికో దాకా వెళ్లి పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు.
శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి, శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ అంజన్కుమార్ సీఎం కేసీఆర్ను అనుసరించారు. అనంతరం అక్కడి నుంచి శాసనసభ సమావేశ మందిరానికి సభా సంప్రదాయం ప్రకారం సీఎం కేసీఆర్, స్పీకర్, మండలి చైర్మన్ గవర్నర్ను తోడ్కొనివెళ్లారు. గవర్నర్ తన స్థానంలో ఆశీనులైన తర్వాత సీఎం సహా సభ్యులంతా తమతమ స్థానాల్లో ఆశీనులయ్యారు. గవర్నర్ ప్రసంగం ముగిసిన తరువాత ఆమె తిరిగివెళ్లేప్పుడు కూడా అదే సంప్రదాయాన్ని అనుసరించి సభ నుంచి వీడ్కోలు పలికారు. కారు వద్దకు వెళ్లి ఆమెకు వీడ్కోలు చెప్పారు.
అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభ ప్రాంగణానికి చేరుకోగానే శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయభాస్కర్, శాసనమండలి విప్ ఎంఎస్ ప్రభాకర్రావు, అసెంబ్లీ కార్యదర్శి వీ నర్సింహాచార్యులు సీఎం కేసీఆర్కు స్వాగతం పలికారు.