వరంగల్ : రాష్ట్రంలోని పురాతన దేవాలయాల పునరుద్ధరణకు తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని రాష్ట్ర ఆర్థిక. వైద్యశాఖ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గం పర్వతగిరిలో నిర్వహిస్తున్న చారిత్రక పర్వతాల శివాలయం ప్రతిష్టాపన మహోత్సవంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ యాదాద్రి, కోటి లింగాల, వేములవాడ దేవాలయాలను అభివృద్ధి చేస్తున్నారని వివరించారు.కొంతమంది పెదవులతో మాట్లాడితే సీఎం కేసీఆర్ హృదయంతో పని చేస్తారని వెల్లడించారు.‘ శివుడి ఆశీస్సులతో రాష్ట్రం అభివృద్ది కావాలి. రాష్ట్ర ప్రజలకు, సీఎం కేసీఆర్ కు శివుడి ఆశీస్సులు ఉండాలని కోరుతున్నానని’ అన్నారు.
ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్న కల్లెడ రామ్మోహన్ రావు, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు అభినందనలు తెలియాజేశారు. 850 ఏళ్ల నాటి జీర్ణావస్థలో ఉన్న శివాలయాన్ని పునర్ ప్రతిష్ఠ చేయడం గొప్ప విషయమని పేర్కొన్నారు.జీర్ణావస్థలో ఉన్న ఒక్క దేవాలయం పునర్ ప్రతిష్ట చేయడం అంటే వంద కొత్త దేవాలయాలను నిర్మించినట్లు సమానమని అన్నారు. పర్వతగిరి ప్రాంతం పుణ్యక్షేత్రము గా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని వివరించారు.
మంత్రి దయాకర్ మాట్లాడుతూ కాకతీయులు కట్టిన శివాలయాలు జిల్లాలో చాలా ఉన్నాయని వాటిని కూడా అభివృద్ధి చేయాలని కోరారు. ఇప్పటికే సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని పలు ఆలయాలకు పూర్వ వైభవం తీసుకువచ్చారని, రామప్ప, లక్నవరం, వెయ్యి స్తంభాల గుడిని అభివృద్ధి చేశారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు గాయత్రి రవి, పసునూరి దయాకర్,ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎమ్మెల్యేలు ఆరూరి రమేశ్, నన్నపనేని నరేందర్ తదితరులు పాల్గొన్నారు.