మంచిర్యాల, సెప్టెంబర్ 7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ‘తెలంగాణ ఉద్యమంలో మేం ఉన్నాం.. తెలంగాణ కోసం మేం పోరాటం చేసినం అని బీజేపోళ్లు..కాంగ్రెసోళ్లు మాట్లాడుతున్నరు. కానీ, వారెవ్వరూ తెలంగాణ కోసం చేసిందేమీ లేదని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు. మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ భవన్లో గురువారం నిర్వహించిన చెన్నూర్ నియోజకవర్గ స్థాయి ఎన్నికల కో-ఆర్డినేషన్ కమిటీల సమావేశంలో బాల్క సుమన్ మాట్లాడారు. కేవలం సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే తెలంగాణ ప్రజానీకం పోరాటం చేసి రాష్ర్టాన్ని సాధించుకున్నారని స్పష్టం చేశారు.
రాష్ట్రం తెచ్చినమనే నమ్మకంతోనే 2014లో ఒంటరిగా పోటీ చేసినా ప్రజలు 63 సీట్లతో బీఆర్ఎస్కు అధికారం ఇచ్చారన్నారు. 2018లో ఇంత అభివృద్ధి చేసినం మమ్ములను ఆశీర్వదించండి అని ప్రజల్లోకి పోతే 88 సీట్లతో గెలిపించారని గుర్తు చేశారు. ఇప్పుడు పదేళ్ల ప్రగతి ప్రస్తావనతో ప్రజల దగ్గరికి పోతున్నామని, ఈ సారి 100 సీట్లతో మమ్మల్ని అశీర్వదిస్తారస్తారని ధీమా వ్యక్తం చేశారు. ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ను 100 సీట్లతో నిలబెడతారన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్తశుద్ధి, పట్టుదల, దార్శనికతను తెలంగాణ సమాజం మొత్తం చూస్తుందన్నారు.
యావత్ దేశమే మన ప్రగతిని కొనియాడుతుందన్నారు. చాలా రంగాల్లో ఈ రోజు మనం టాప్లో ఉన్నామన్నారు. తలసరి ఆదాయంలో, తలసరి విద్యుత్ వినియోగంలో, ఐటీ ఎగుమతుల్లో, నీలి విప్లవంలో, హరిత విప్లవం, క్షీర విప్లవం, యెల్లో అండ్ పింక్ రెవల్యూషన్లలో దేశంలోనే అగ్రగామిగా నిలిచామన్నారు. కాళేశ్వరంలాంటి ప్రాజెక్టులను రికార్డు సమయంలో పూర్తి చేసుకున్నామన్నారు.
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా కరువు నేల, వలసల నేలైనా పాలమూరు ప్రజల పాదాలు కడగడానికి, వారి నారు మడుల్లోకి కృష్ణమ్మ నీళ్లను మళ్లించే కార్యక్రమానికి ఈ నెల 16న ముఖ్యమంత్రి కేసీఆర్ అంకురార్పణ చేయనున్నారన్నారు. ఇవన్నీ కూడా ప్రజల కండ్ల ముందున్నయ్, ప్రజల అనుభవంలో ఉన్నయ్.. అందుకే ముచ్చటగా మూడోసారి బ్రహ్మాండంగా 100 సీట్లతో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడబోతుందని స్పష్టం చేశారు.
తెలంగాణ రాష్ర్టాన్ని మరింత ప్రగతిలోకి, అభివృద్ధిలోకి తీసుకుపోవడం సీఎం కేసీఆర్తోనే సాధ్యం అవుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, టీబీజీకేఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెంగర్ల మల్లయ్య, నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు.