హైదరాబాద్, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర పౌరసరఫరాల సంస్థలో మరో కొత్త పోస్టును క్రియేట్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టుగా విశ్వసనీయ సమాచారం. ఎండీకి తోడుగా జీఎండీ(జాయింట్ ఎండీ) పోస్టును ఏర్పాటుచేస్తున్నట్టు తెలిసింది. ఇందుకు సంబంధించి ఇప్పటికే చర్యలు ప్రారంభించినట్టుగా తెలుస్తున్నది. అయితే, ఇప్పుడు ఈ కొత్త పోస్ట్ ఎందుకనే చర్చ జరుగుతున్నది. ఇప్పటికే ఎండీ కాకుండా డైరెక్టర్తోపాటు అడిషనల్ డైరెక్టర్ పోస్టులు కూడా ఉన్నాయి. ఈ రెండింటిలోనూ ఐఏఎస్ అధికారులున్నారు. ఇవి కాకుండా మరో కొత్త పోస్టు క్రియేట్ చేయాలనే నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, ఈ పోస్టును ప్రత్యేకంగా ఓ అధికారి కోసం క్రియేట్ చేస్తున్నట్టు సమాచారం.
ఎఫ్సీఐలో పనిచేస్తున్న సదరు అధికారి త్వరలోనే ఉద్యోగ విరమణ చేయనుండటంతో, ఆ అధికారిని సివిల్సప్లయ్ కార్పొరేషన్లోకి తీసుకునేందుకు వీలుగా జీఎండీ పోస్టును క్రియేట్ చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తున్నది. ఎఫ్సీఐలో పని చేసిన అధికారి, సివిల్ సప్లయ్లో ఉండడంతో కేంద్రంతో సంప్రదింపులకు మార్గం సులువుగా ఉంటుందనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. జీఎండీ పోస్టు క్రియేషన్తో ఎండీ వర్సెస్ జీఎండీగా మారే ప్రమాదం కూడా లేకపోలేదనే చర్చ సివిల్ సప్లయ్ వర్గాల్లో జరుగుతున్నది.