జ్యోతినగర్ (గోదావరిఖని), ఆగస్టు 2: సింగరేణి కార్మికుల ప్రయోజనాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవవడం లేదని తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి ధ్వజమెత్తారు. పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీలోని ఖాజిపల్లిలో ఆదివారం నిర్వహించిన టీబీజీకేఎస్ కేంద్ర కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. సింగరేణి సంస్థ కాంట్రాక్టర్లకు అధిక రేట్లు ఇస్తూ కమిషన్లు ఆశిస్తున్నదని విమర్శించారు.
సైట్ విజిట్ పేరుపై ఎక్స్ప్లోజివ్ టెండర్లు, ఓబీ కాంట్రాక్ట్లు, 800 మెగావాట్ల థర్మల్ పవర్, లోకల్ సోలార్ పవర్ వంటి అంశాలలో జరిగిన అక్రమాలపై విచారణ జరిపించాలని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, సీఎం రేవంత్రెడ్డికి విన్నవించినా పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. బీఆర్ఎస్ సహకారంతో రానున్న రోజుల్లో ప్రత్యక్ష పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి కేతిరెడ్డి సురేందర్రెడ్డి, వర్కింగ్ ప్రెసిండెంట్ మాదాసు రామ్మూర్తి, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నూనె కొమురయ్య తదితరులు పాల్గొన్నారు.