హైదరాబాద్, ఫిబ్రవరి 21 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కేసీఆర్లోని మానవీయ కోణానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి పాలియేటివ్ కేర్ కేంద్రాలు. క్యాన్సర్, గుండెజబ్బుల వంటి దీర్ఘకాలిక,ప్రాణాంతక వ్యాధులతో బాధపడేవారు తమ ఆఖరి రోజులను గౌరవంగా గడపాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ 2017లో పాలియేటివ్ కేర్ కేంద్రాలకు శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం ప్రతి జిల్లా ప్రభుత్వ దవాఖానలో ‘పాలియేటివ్ కేర్ సెం టర్’ ఏర్పాటైంది. ఇక్కడ రోగులకు ఆత్మీయ చికిత్సతోపాటు మందులు ఉచితంగా లభిస్తున్నాయి. పౌష్ఠికాహారం అందుతున్నది. ఆప్యాయంగా మాట్లాడే సిబ్బంది, అవసరానికి దగ్గరుండే కుటుంబసభ్యుల మధ్య గౌరవంగా ఆఖరి రోజులు గడిపే వీలు కలుగుతున్నది.
ప్రతీ కేంద్రంలో 6 నుంచి 10 పడకలు
ప్రతీ పాలియేటివ్ కేర్ కేంద్రంలో కనీసం 6 నుంచి 10 పడకలు ఏర్పాటుచేస్తున్నారు. రోగులకు చికిత్స అందించడానికి ప్రత్యేకంగా వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది ఉంటారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నవారు, చివరి రోజులు గడుపుతున్నవారు నేరుగా ఈ కేంద్రాలకు వెళ్లవచ్చు, లేదా వైద్యులు రెఫర్ చేస్తారు. ఈ కేంద్రాల్లో ప్రధానంగా ఇన్పేషెంట్, ఔట్పేషెంట్, హోంకేర్ చికిత్సలు లభిస్తున్నాయి. దవాఖాన నుంచి 50 కిలోమీటర్ల పరిధిలో ఉన్న రోగులకు హోంకేర్ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. పాలియేటివ్ కేం ద్రాల్లో చేరే రోగులకు వారికి తలెత్తిన ఇబ్బందులు, లక్షణాల ఆధారంగా చికిత్స చేస్తారు. ఒళ్లు నొప్పులు, శ్వాస సమస్య, మలబద్ధకం, పుండ్లు, ఇతర గాయాల వంటి సమస్యలు వచ్చినప్పుడు ఆయా బాధలు తగ్గేలా చికిత్స అందిస్తారు.
లక్షన్నర మందికిపైగా వైద్యసేవలు
పాలియేటివ్ కేంద్రాల ద్వారా రాష్ట్రంలో ఇప్పటివరకు లక్షన్నర మందికిపైగా సేవలు పొందడం విశేషం. నెలకు సగటున రాష్ట్రవ్యాప్తంగా 500 మంది ఇన్పేషెంట్లుగా, దాదాపు 1,200 మంది ఔట్ పేషెంట్లుగా, సుమారు 5 వేల మంది హోంకేర్ ద్వారా చికిత్స పొందుతున్నారు. 2017 నుంచి ఇప్పటివరకు 10 వేల మందికిపైగా ఇన్ పేషెంట్లుగా, 35 వేల మందికిపైగా ఔట్ పేషెంట్లుగా సేవలు పొందగా, లక్ష మందికి పైగా హోంకేర్ సేవలు పొందారు.
దేశంలోనే తెలంగాణ ఆదర్శం
దేశవ్యాప్తంగా సుమారు 800 పాలియేటివ్ కేర్ సెంటర్లు ఉండగా, 170 మాత్రమే ప్రభు త్వ ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. వీటిలో 33 (దాదాపు 20%) తెలంగాణలోనే ఉండటం విశేషం. తద్వారా పాలియేటివ్ కేర్ సేవల్లో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచింది.
నోటి క్యాన్సర్ బాధితుడికి ఆయుష్షు
నిర్మల్ జిల్లా లక్ష్మణచాంద మండల కేంద్రానికి చెందిన 44 ఏండ్ల కృష్ణప్రసాద్ ఆటో నడుపుకుంటూ జీవనం సాగించేవాడు. ఏడు నెలల క్రితం నోటి క్యాన్సర్ బారిన పడ్డాడు. హైదరాబాద్లోని ఓ క్యాన్సర్ దవాఖానలో వైద్యులు పరీక్షించగా నాలుగో స్టేజీలో ఉన్నదని నిర్ధారించి కీమోథెరపీ చేసి ఇంటికి పంపించారు. నాలుగు నెలలకు మించి బతకడం కష్టమనుకున్నారు. ఈ దశలో నిర్మల్లోని పాలియేటివ్ కేర్ సెంటర్ కృష్ణప్రసాద్ను అక్కున చేర్చుకొని ఆయుష్షు పెంచింది.
ముఖ్యమంత్రి కేసీఆర్ దేవుడితో సమానం
నేను ఇంకా బతికి ఉన్నానంటే నిర్మల్ పాలియేటివ్ సెంటర్ పుణ్యమే.. వీరి సేవలతో ఇంకా కొంతకాలం బతుకుతానన్న ఆశ పెరుగుతున్నది. నా లాంటి వారి కోసం పాలియేటివ్ కేర్ సెంటర్ను ఏర్పాటు చేసిన సీఎం కేసీఆర్ దేవుడితో సమానం.
-కృష్ణప్రసాద్, నోటి క్యాన్సర్ బాధితుడు, నిర్మల్
రోగుల కుటుంబాలకు ఉపశమనం
సీఎం కేసీఆర్ మానవీయ కోణంలో ఆలోచించి పాలియేటివ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాల్లో ఆత్మీయ చికిత్స అందుతున్నది. అవసరమైతే సిబ్బందే ఇంటికి వెళ్లి వైద్యం చేసి వస్తున్నారు. పాలియేటివ్ కేంద్రాలు రోగులకు వరంగా మారడంతోపాటు వారి కుటుంబాలకు ఉపశమనం కల్పిస్తున్నాయి. తెలంగాణ పాలియేటివ్ కేంద్రాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి.
– తన్నీరు హరీశ్రావు, ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి
కేసీఆర్ ఇచ్చిన వరం
క్యాన్సర్ రోగం వస్తే చనిపోవడమే అనుకున్న.. ట్రీట్మెంట్ కోసం ప్రైవేట్ దవాఖానకు వెళ్తే స్థోమత మాకు లేదు. కామారెడ్డిలోని పాలియేటివ్ కేర్ సెంటర్లోనే ఎలాంటి ఖర్చు లేకుండా వైద్య సేవలు అందిస్తున్నారు. ఇంటి మనుషుల్లా చూసుకుంటున్నారు. ఇది మాకు కేసీఆర్ ఇచ్చిన వరం.
-రాజవ్వ, గుర్జాల, గాంధారి మండలం, కామారెడ్డి జిల్లా
ఏడాదిగా ములుగులో చికిత్స పొందుతున్నా
క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న. గతంలో హైదరాబాద్లోని బసవతారకం, నిమ్స్, ఎంఎన్ఆర్ దవాఖానలకు పోయిన. చాలా డబ్బులు ఖర్చయ్యేవి. ములుగులోని ఏరియా దవాఖానలో పాలియేటివ్ కేర్ సెంటర్లో చేరిన. ఏడాదిగా ఉచితంగా మందులు ఇస్తున్నరు. రోజుకు మూడుసార్లు చెకప్ చేస్తున్నారు. ప్రతిరోజూ డాక్టర్, ముగ్గురు నర్సులు చెకప్ చేసి, ఫిజియోథెరపీ సైతం చేస్తున్నరు. ఉదయం పాలు, బ్రెడ్డు, మధ్యాహ్నం భోజనం, పండ్లు ఇస్తున్రు. రాత్రిపూట గుడ్డు, అరటిపండు, స్నాక్స్ ఇస్తుండ్రు.
– హనుమాండ్ల స్వరూప, మానుకోట