హైదరాబాద్, జనవరి 22 (నమస్తే తెలంగాణ): ఈ ఫొటోలోని డీజిల్ జనరేటర్కు కొంత దూరంలో ఓ మహిళ బోరు నుంచి వస్తున్న నీటిని ఆనందంగా చూస్తున్నది కదా. దీని వెనుక ఒక పెద్ద కథే ఉన్నది. ఆమె ఆదివాసీ గోండు మహిళ. పేరు సిడాం పంచపూల. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం లాల్గఢ్ లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన ఆమెకు దాదాపు 4.5 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నది. 15 ఏండ్ల క్రితం అప్పుతెచ్చి బోరు వేశారు. కానీ విద్యుత్తు లేదు. మోటర్ పంప్ కూడా లేకపోవడంతో చాలా ఏండ్లపాటు వర్షాధారంతో పత్తి, జొన్న, కంది లాంటి పంటలు వేసినా నీళ్లు లేక సరిగా పండేవి కాదు. దీంతో ఐదేండ్ల క్రితం అప్పుచేసి ఈ జనరేటర్ను కొని, పత్తి, జొన్నలు, గోధుమలు, మిర్చి లాంటి పంటలు వేస్తున్నారు. అవి బాగానే పండుతున్నప్పటికీ రోజుకు రూ.1,000 నుంచి రూ.12 వందల వరకు డీజిల్ ఖర్చు తడిసి మోపడవుతున్నది. అలా నాలుగున్నర ఏండ్లు వ్యవసాయం చేసినా చేతిలో చిల్లిగవ్వ మిగిలేది కాదు. కానీ, రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘గిరి వికాసం’ పథకం ఆ మహిళ జీవితంలో వెలుగులు నింపింది. ఈ పథకం కింద రూ.1.80 లక్షలతో సిడాం పంచపూల వ్యవసాయ క్షేత్రానికి విద్యుత్తు కనెక్షన్ ఇవ్వడంతో ఏడాది నుంచి జనరేటర్ను మూలనపడేశారు. పైసా ఖర్చు లేకుండా బోరు నుంచి అవసరమైనంత నీరు లభిస్తుండటంతో పత్తి, కంది, పచ్చిమిర్చి, పల్లికాయ, టమాట, గోరుచిక్కుడు లాంటి పంటలను ఏటా రెండు సార్లు పండిస్తున్నది. అందుకే ఆమె మొహంలో అంత ఆనందం కనిపిస్తున్నది.
19,081 కుటుంబాలకు లబ్ధి
ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, ములుగు, మహబూబాబాద్, నిర్మల్, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబ్నగర్, నాగర్కర్నూల్ తదితర జిల్లాల్లో ప్రభుత్వం ‘గిరి వికాసం’ ద్వారా ఆదివాసీలు, గిరిజనుల భూములను వ్యవసాయానికి అనువైనవిగా మారుస్తున్నది. ఇప్పటి వరకు 54,793 ఎకరాల భూముల్లో ఏటా రెండు పంటలు పండే విధంగా ఏర్పాట్లు చేసింది. దీని కోసం ఇప్పటి వరకు రూ.155 కోట్లను కేటాయించగా.. రూ.97.78 కోట్లు ఖర్చు చేశారు. తద్వారా 19,081 గిరిజనుల కుటుంబాలు లబ్ధిపొందాయి.
ఈ ఫొటోలోని ఆదివాసీ మహిళ పేరు మెస్రం నాగుబాయి. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం ఉమ్రి(టీ) గ్రామానికి చెందిన ఆమె పేరిట 2.5 ఎకరాల భూమి ఉన్నది. గతంలో వర్షాధారంగా పత్తి, జొన్న సాగు చేస్తే చేతిలో పైసా మిగలకపోగా అప్పులు అయ్యేవి. కానీ, నాగూబాయి కుటుంబంలో ‘గిరి వికాసం’ కొత్త వెలుగును నింపింది. ఈ పథకం కింద దాదాపు 200 ఫీట్ల బోరు వేశారు. రూ.4 లక్షల వ్యయంతో డీటీఆర్ లైను వేసి విద్యుత్తు కనెక్షన్ ఇవ్వడంతో ఇప్పుడు ఏటా రెండు పంటలను పండిస్తున్నారు. ఇప్పటికే ఇద్దరు ఆడబిడ్డల పెండ్లిళ్లు అవడంతో నాగుబాయి, ఆమె భర్త సంతోషంగా వ్యవసాయం చేసుకుంటున్నారు.
గిరిజనుల జీవితాల్లో వెలుగులు
గిరి వికాసం పథకం కింద గిరిజనులకు విద్యుత్తును అందిస్తున్నాం. తలమడుగు మండలంలో ఇప్పటికే దాదాపు రూ.30 లక్షల వ్యయంతో 18 మంది లబ్ధిదారులకు వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్లు ఇచ్చాం. ఐటీడీఏ ఆధ్వర్యంలో బోర్లు వేస్తున్నారు. విద్యుత్తు కనెక్షన్ ఖర్చులను కూడా ఐటీడీఏ భరిస్తుండటంతో గిరిజనుల వ్యవసాయ భూముల్లో పైసా ఖర్చు లేకుండా నీరు పారుతున్నది. ఇప్పుడు జనరేటర్లు, డీజిల్ ఖర్చులు లేకపోవడంతో వారి జీవితాల్లో మార్పు, వారి కండ్లల్లో వెలుగు స్పష్టంగా కనపడుతున్నది.
– సతీశ్కుమార్,ఏఈ, తలమడుగు మండలం