హైదరాబాద్: రాష్ట్రంలో పల్లెలు, పట్టణాల అభివృద్ధికి ఖర్చు చేయడానికి ప్రతి మంత్రికి రూ.2 కోట్లు, జిల్లా కలెక్టర్కు కోటి రూపాయల నిధులను కేటాయించినందుకుగాను సీఎం కేసీఆర్కు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కృతజ్ఞతలు తెలిపారు. అత్యవసర సమయాల్లో వ్యయం చేయడానికి మంత్రులు, జిల్లా కలెక్టర్లకు ఈ ఫండ్ ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు. పల్లెలు, పట్టణాల రూపు రేఖలు మార్చాలని, కనీస వసతులు, సదుపాయాలు కల్పించాలని, ప్రతి గ్రామం, పట్టణం పరిశుభ్రంగా, పచ్చదనంతో వెల్లివిరియాలని సీఎం కేసీఆర్ ముందు చూపుతో పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని చేపట్టారని వెల్లడించారు. ఇప్పటికే అనేక పథకాలు, కార్యక్రమాలతో దేశానికి తెలంగాణ ఆదర్శంగా నిలిచిందని చెప్పారు. పల్లె ప్రగ్రతి కార్యక్రమం ద్వారా ప్రతి ఊరు ఆదర్శ గ్రామంగా మారుతుందని తెలిపారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతికి కావాల్సినన్ని నిధులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. గ్రామాల అభివృద్ధి కోసం ఎన్ని నిధులనైనా వెచ్చించడానికి సీఎం కేసీఆర్ సిద్ధంగా ఉన్నారని మంత్రి చెప్పారు.