మోర్తాడ్, మే 24: కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను పట్టించుకోవడంలేదని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి రైతుల కష్టాల కన్నా, అందాల పోటీలు ఎక్కువయ్యాయని ఎద్దేవా చేశారు. ధాన్యం సేకరణపై అ ధికారులతో సమీక్ష నిర్వహించడానికి కూడా సమయం లేని ముఖ్యమంత్రి అందాల పోటీల విషయంలో ఎనిమిదిసార్లు సమీక్ష నిర్వహించినట్టు విమర్శించారు. రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు చేశామని ప్రభుత్వం గొప్పలు చెబుతున్నా, అవన్నీ ఉట్టిమాటలేనని శనివారం ఒక ప్రకటనలో విమర్శించారు.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఇంకా కల్లాల వద్ద, రహదారులపై ధాన్యపు రాశులు కుప్పలుకుప్పలుగా పడి ఉన్నాయని, ప్రభుత్వం సకాలంలో ధాన్యం కొనకపోవడంతో అకాల వర్షాలకు తడిసి మొలకలు వచ్చి రైతాంగం తీవ్రంగా నష్టపోతున్నట్టు తెలిపారు. కల్లాల వద్ద కొనుగోలు చేసిన ధాన్యం కూడా రైస్ మిల్లులకు తరలించడానికి సకాలంలో లారీలను ప్రభుత్వం పంపకపోవడంతో ధాన్యం నీటిపాలవుతున్నదని, దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. మిల్లుల వద్ద తరుగు తీస్తూ రైతులకు తీవ్రనష్టం కల్గిస్తున్నారని తెలిపారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డిని కోరారు.