Telangana | రాజన్న సిరిసిల్ల, జూన్ 12 (నమస్తే తెలంగాణ)/గంభీరావుపేట: తరగతి గదిలో గోడల చుట్టూ రంగురంగుల బొమ్మలు.. బోర్డుపై డిజిటల్ స్క్రీన్లు, కం ప్యూటర్ ల్యాబ్లు.. ఇంగ్లిష్ మీడియం చదువులు, పరిశుభ్రమైన వంటశాల.. తినటానికి పౌష్ఠికాహారం.. ఈ సదుపాయాలున్నది గొప్పగొప్ప కార్పొరేట్ స్కూ ళ్లలో కాదు.. తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో కల్పిస్తున్న వసతులు. ప్రభుత్వం కల్పిస్తున్న ఈ సదుపాయాలతో ఏటికేడు ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు పెరుగుతున్నాయి. ‘మన ఊరు-మన బడి’ కార్యక్ర మంతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారిపోతుంటే, అడ్మిషన్ల కోసం విద్యార్థులు, తల్లిదండ్రులు ‘బడి బాట’ పడుతున్నారు. ఉమ్మడి పాలనలో పాలకుల నిర్లక్ష్యంతో సర్కారు బడులకు గ్రహణం పట్టిం ది. పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు పంపించాలంటేనే తల్లిదండ్రులు జంకేవాళ్లు. అప్పో సొప్పో చేసైనా ప్రైవేట్ స్కూల్కు పంపిద్దామన్న ఆలోచనలో ఉండేవారు. కానీ, తెలంగాణ ప్రభుత్వం వచ్చాక సర్కారు బడుల రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. విద్యపై ప్రత్యేక శ్రద్ధ పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం.. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట వేసింది. తరగతి గది దగ్గర నుంచి మూత్రశాలల వరకు అన్నింటినీ ఆధునికీకరించింది. దాంతో ప్రైవేట్ స్కూళ్ల బాట పట్టిన విద్యార్థులంతా, ఇప్పుడు సర్కారు బడుల వైపు దారిపట్టారు. అందుకు గొప్ప ఉదాహరణగా రాజన్న సిరిసిల్ల జిల్లాలోని గంభీరావుపేట ప్రభుత్వ పాఠశాలే.
గంభీరావుపేటలోని ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్ తీసుకొంటే పీజీ వరకు ఉచితంగా చదువుకోవచ్చు. మంత్రి కేటీఆర్ చొరవతో రహేజా కార్ప్ ఫౌండేషన్, మైండ్ స్పేస్ రిట్, యశోద హాస్పిటల్, ఎమ్మార్ఎఫ్, దివీస్ ల్యాబ్, గివ్ తెలంగాణ, గ్రీన్కో సహకారంతో 6 ఎకరాల్లో రూ.3 కోట్ల వ్యయంతో దీన్ని నిర్మించారు. మొత్తం 70 తరగతి గదుల్లో 3,500 మంది తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ మీడియంలో అభ్యసించొచ్చు. 250 మంది చిన్నారులకు సరిపడేలా అంగన్వాడీ కేంద్రం, చిన్నారులకు ప్రీ ప్రైమరీ, క్రీడామైదానంతో పాటు ప్రైమరీ, ఉన్నత పాఠశాల, ఇంటర్, డిగ్రీ, పీజీ కాలేజీల భవనాలను నిర్మించారు. ఈ ప్రాంగణంలోనే డిజిటల్ లైబ్రరీ, కంప్యూటర్ ల్యాబ్, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, వెయ్యి మంది కూర్చొని తినేలా డైనింగ్ హాల్, ఆర్వో ప్లాంట్, వంట గది, స్టోర్ రూమ్ ఏర్పాటు చేశారు. ఇక్కడ విద్యార్థులకు శారీరక ఉల్లాసానికి క్రికెట్, వాలీబాల్, ఫుట్బాల్, బాస్కెట్బాల్ కోర్టులతో పాటు అథ్లెటిక్ ట్రాక్ కూడా ఉన్నది.
రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన వసతులతో తల్లిదండ్రులు, విద్యార్థులు సర్కారు బడుల్లో అడ్మిషన్ల కోసం ఎగబడుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో డిమాండ్ ఏ స్థాయికి చేరిందంటే.. చాలా పాఠశాలల్లో నో అడ్మిషన్ బోర్డులు పెట్టాల్సి వస్తున్నది. సిద్దిపేటలోని జడ్పీహెచ్ఎస్కు ఈ ఏడాది దాదాపు 500 దరఖాస్తులు వచ్చాయి. ఒక్క ఆరో తరగతికే 180 దరఖాస్తులు రావటం గమనార్హం. ఈ పాఠశాలలో నేడో, రేపో ‘నో అడ్మిషన్ బోర్డు’ పెట్టే అవకాశం ఉన్నది. ఇలా రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు దాదాపు అడ్మిషన్లతో కళకళలాడుతున్నాయి. కార్పొరేట్ స్కూళ్లలో కల్పించే అన్ని రకాల వసతులు సర్కారు బడుల్లోనే కల్పించటంతో విద్యార్థులు సర్కారు బడిలో ప్రవేశాలకు మొగ్గు చూపుతున్నారు.
మాది మెదక్ జిల్లా రామాయంపేట. నాకు ఇద్దరు కొడుకులు. ఒకరు 6వ తరగతి, మరొకరు 8వ తరగతి. గంభీరావుపేటలో కేజీ నుంచి పీజీ వరకు ఒకే దగ్గర నాణ్యమైన విద్య అందిస్తున్నారని తెలిసి ఇక్కడికి వచ్చిన. నా ఇద్దరు కొడుకులకు అడ్మిషన్ చేయించిన. సర్కారు అందిస్తున్న నాణ్యమైన విద్యతో మా పిల్లల చదువంత ఇక్కడే పూర్తి అవుతుంది.
– స్వామి కుమార్, విద్యార్థి తండ్రి, రామాయంపేట, మెదక్ జిల్లా