హైదరాబాద్: నల్లగొండ అభివృద్ధికి ప్రభుత్వం నిధులు కేటాయించింది. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు పట్టణంలో వివిధ అభివృద్ధి పనులకు రూ.233.82 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు ప్రభుత్వం జీవో 44 జారీచేసింది. ఈ నిధులతో పానగల్లు, పచ్చల సోమేశ్వర దేవాలయాలకు మహర్దశ రానుంది. నల్లగొండ ఐటీ పార్కు నుంచి ఉదయ సముద్రానికి అప్రోచ్ రోడ్డు నిర్మించనున్నారు.
అదేవిధంగా నీలగిరి పట్టణంలో కళాభారతి నిర్మాణానికి ప్రభుత్వం రూ.90.61 కోట్లు కేటాయించింది. జిల్లా కేంద్రంలో శాశ్వత హెలీపాడ్ నిర్మాణానికి కూడా నిధులు విడుదల చేసింది. దీంతో నల్లగొండ సుందరీకరణకు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీని నెరవేర్చినట్లయింది. కాగా, పట్టణంలో చేపట్టిన అభివృద్ధి పనులపై ఇప్పటికే అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే.