బ్యాంకుల్లో కట్టుదిట్టంగా ఖాతాలు
లావాదేవీలకు కఠిన నిబంధనలు
దుర్వినియోగం జరగకుండా మార్గదర్శకాలు విడుదల
హైదరాబాద్, ఫిబ్రవరి 21 : బ్యాంకుల్లోని ప్రభుత్వ ఖాతాలు, వాటిలోని నిధులు దుర్వినియోగం కాకుండా చూసేందుకు రాష్ట్ర ప్రభు త్వం నడుం బిగించింది. ఇటీవల తెలుగు అకాడమీ నిధుల్లో గోల్మాల్ జరగడంతో కట్టుదిట్టమైన చర్యలకు ఉపక్రమించింది. ప్రభుత్వ విభాగాలకు సంబంధించిన ఖాతాలు, లావాదేవీల నిర్వహణపై నిబంధనలు విధిస్తూ సోమవారం మార్గదర్శకాలు జారీచేసింది. ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతితోనే బ్యాంకు ఖాతాలు, ఫిక్స్డ్ డిపాజిట్ ఖాతాలు తెరవాలని స్పష్టం చేసింది. ప్రస్తుతమున్న ఫిక్స్డ్ డిపాజిట్ ఖాతాలు ప్రభుత్వం ఎంప్యానల్ చేసిన బ్యాంకుల్లో ఒకే ఖాతాగా ఉండాలని పేర్కొన్నది. అనుమతి లేకుండా ఫిక్స్డ్ డిపాజిట్లు చేయకూడదని తెలిపింది. బ్యాంకు ఖాతాలు, ఫిక్స్డ్ డిపాజిట్ ఖాతాలను సంబంధిత శాఖాధిపతి, డ్రాయింగ్ లేదా ఫైనాన్స్ అధికారుల సంయుక్త పర్యవేక్షణలో నిర్వహించాలని సూచించింది. బ్యాంకు ఖాతాలకు సంబంధించిన రికార్డులను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఆడిటింగ్ నిర్వహించాలని పేర్కొన్నది. ఫిక్స్డ్ డిపాజిట్ లావాదేవీలను నగదు రూపంలో కాకుండా ఎలక్ట్రానిక్ రూపంలో జరపాలని తెలిపింది. బ్యాంకు ఖాతాలకు సంబంధించిన ఈ-మెయిళ్లు, మెసేజ్లను అధికారిక మెయిల్, ఫోన్ నంబర్లకే అనుసంధానించాలని సూచించింది. ఏ ప్రభుత్వ శాఖకైనా, ప్రభుత్వ రంగ సంస్థకైనా అన్ని రకాలు కలిపి 3 కంటే ఎక్కువ ఖాతాలు ఉండకూడదని స్పష్టం చేసింది. ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థల బ్యాంకు ఖాతాలు, ఫిక్స్డ్ డిపాజిట్లకు సంబంధించిన వివరాలను వెంటనే ifmis telangana.gov.in పోర్టల్లో నమోదు చేయాలని ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావు కొత్త మార్గదర్శకాల్లో స్పష్టం చేశారు. ఆయా ఖాతాలకు ప్రభుత్వ అనుమతి ఉన్నదో లేదో పరిశీలించుకోవాలని సూచించిచారు. వచ్చే నెల 10 నాటికి నిర్దేశిత ఫార్మాట్లో నివేదిక సమర్పించాలని అన్ని శాఖలను ఆదేశించారు.