హైదరాబాద్, ఫిబ్రవరి 16 (నమస్తే తెలంగాణ): పోడు భూములకు యాజమాన్య పట్టాలను అందించేందుకుగానూ జిల్లాస్థాయి కమిటీలో ఆమోదం పొందిన వాటికి పాస్ పుస్తకాల తయారీ చేపట్టాలని అధికారులను రాష్ట్ర చీఫ్ సెక్రటరీ శాంతికుమారి ఆదేశించారు. నిరుపేదలకు భూమి పట్టాలు అందజేసేందుకు అర్బన్ ప్రాంతాల్లో ప్రభుత్వ భూములు, అర్హుల వివరాలను శాసనసభ నియోజకవర్గాల వారీగా సేకరించి వెంటనే ప్రభుత్వానికి పంపాలని సూచించారు. గురువారం ఆమె హైదరాబాద్లోని బీఆర్కేఆర్ భవన్ నుంచి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పలు అంశాలపై సమీక్షించారు. ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న కంటి వెలుగు కార్యక్రమం మే నెలాఖరు వరకు కొనసాగుతుందని చెప్పారు. లబ్ధిదారులకు అందించే కంటి అద్దాల పంపిణీలో జాగ్రత్త వహించాలని సూచించారు. ఎండలు తీవ్రమవుతున్న నేపథ్యంలో కంటి వెలుగు పరీక్షా శిబిరాల వద్ద మంచినీటి సరఫరాతోపాటు టెంట్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా 2023-24 సంవత్సరంలో పెద్ద సంఖ్యలో మొకలు నాటేందుకు వెంటనే కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని కలెక్టర్లను ఆదేశించారు. 58, 59, 76, 118 జీవోల కింద ఎంపికైన లబ్ధిదారులందరికీ వెంటనే రిజిస్ట్రేషన్ చేయించాలని సూచించారు. నిర్మాణం పూర్తయిన సమీకృత జిల్లా కలెక్టరేట్ కార్యాలయాల్లోకి అన్ని ప్రభుత్వ కార్యాలయాలను తరలించే ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్లో మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్కుమార్, పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టినా చోంగ్తు, రోడ్లు భవనాల శాఖ కార్యదర్శి శ్రీనివాసరాజు, వైద్యారోగ్య శాఖ కార్యదర్శి రిజ్వి, పీసీసీఎఫ్ డోబ్రియల్, తదితరులు పాల్గొన్నారు.