ఖమ్మం, జూన్ 28 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు పోలీసుల అదుపులో మరణించిన ఖమ్మం జిల్లా చింతకాని మండలం కోమట్లగూడేనికి చెందిన మరియమ్మ కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలిచింది. ఆమె కుమారుడు ఉదయ్కిరణ్కు ప్రభుత్వ ఉద్యోగం కల్పించింది. ఎంపీ నామా నాగేశ్వరరావు, మధిర ఎమ్మెల్యే మల్లు భట్టివిక్రమార్క, జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజుతో కలిసి రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ సోమవారం కోమట్ల గూడెంలోని మరియమ్మ నివాసానికి వెళ్లారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు.
ఆమె కుమారుడు ఉదయ్కిరణ్కు సాంఘిక సంక్షేమ శాఖలో ఆఫీసు సబార్డినేట్గా పోస్టింగ్ ఇస్తూ ప్రభుత్వం జారీ చేసిన నియామక పత్రాన్ని అతనికి అందజేశారు. అలాగే ఉదయ్కిరణ్కు రూ.15 లక్షలు, ఇద్దరు కుమార్తెలకు రూ.10 లక్షల చొప్పున మొత్తం రూ.35 లక్షల విలువైన చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి అజయ్, ఎంపీ నామా నాగేశ్వరరావు సదరు కుటుంబ సభ్యులతోపాటు మీడియాతో మాట్లాడుతూ.. మరియమ్మ మృతి దురదృష్టకరమన్నారు. ఈ ఘటనపై ప్రభుత్వం ఇప్పటికే విచారణ చేపట్టిందని, బాధ్యులపై చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఈ తరహా ఘటనలు జరుగకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. ఘటన గురించి తెలుసుకున్న సీఎం కేసీఆర్ వెంటనే స్పందించి కుటుంబానికి అవసరమైన సహాయ సహకారాలు అందించినట్టు చెప్పారు. ఉదయ్ కిరణ్కు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడం, కుమార్తెలకు ఆర్థికసాయం చేయడంపై ఆమె కుటుంబ సభ్యులతోపాటు గ్రామస్థులు సైతం ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.