హైదరాబాద్, సెప్టెంబర్ 20 (నమస్తే తెలంగాణ): దళితుల ఆర్థిక అభ్యున్నతే లక్ష్యంగా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ‘దళితబంధు’ పథకం కింద ఇప్పటివరకు మంజూరు చేసిన యూనిట్లలో 80 శాతం వరకు గ్రౌండింగ్ అయ్యాయని ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. దళితబంధు పథకం అమలుపై మంగళవారం సంబంధిత శాఖ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. అర్హులైన దళితులందరికీ రూ.10 లక్షల ఆర్థిక సహాయం అందిస్తామని, పైరవీలకు తావులేకుండా యూనిట్లు మంజూరు చేస్తున్నామని పేర్కొన్నారు. లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు యూనిట్లు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. జగిత్యాల జిల్లాలో ఏకంగా 3,500పైగా దరఖాస్తులు వచ్చాయన్నారు. అకడకడ దళితబంధు నిధులు లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ కావడం లేదని వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని చెప్పారు. ఈ నెల 27న ఖమ్మం జిల్లా చింతకానిలో దళితబంధు పథకం అమలును తాను స్వయంగా పరిశీలించనున్నట్టు మంత్రి తెలిపారు. ఈ సమీక్షలో ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, ఎస్సీ కార్పొరేషన్ ఎండీ కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.