ఖమ్మం : ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్యను అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు – మన బడి కార్యక్రమం సత్ఫలితాలను ఇస్తుందని మంత్రి స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లాలోని అశ్వారావుపేట నియోజకవర్గం అచ్యుతాపురంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో రూ. 16.92 లక్షలతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను మంత్రి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి అజయ్ మాట్లాడుతూ.. తల్లిదండ్రుల ఆకాంక్ష మేరకు వారి పిల్లలకు నాణ్యమైన ఇంగ్లీష్ మీడియం విద్యను అందించేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని తెలిపారు. ఈ క్రమంలో ప్రతి ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం బోధన ప్రారంభించామని చెప్పారు. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతి విద్యార్థికి ప్రాథమిక సౌకర్యాలు, నాణ్యమైన, ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందించేందుకు రాష్ట్రవ్యాప్తంగా విద్యా మౌలిక సదుపాయాలను బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు అజయ్ కుమార్ పేర్కొన్నారు.