కార్పొరేషన్, ఏప్రిల్ 25: ప్రజల శారీరక ఆరోగ్యం కోసం నగరపాలక సంస్థ తగిన సౌకర్యాలు కల్పించేందుకు ఇప్పటికే అనేక కార్యక్రమాలు చేపట్టింది. ఇందులో భాగం గా రాష్ట్ర ప్రభుత్వం పట్టణ ప్రగతి కింద ఇస్తున్న నిధుల నుంచి వ్యయం చేస్తూ మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు. నగరంలో ఇప్పటికే 15 ప్రాంతాల్లో వాకింగ్ ట్రాక్స్, 30 ప్రాంతాల్లో ఓపెన్ జిమ్లను ఏర్పాటు చేస్తున్నారు. వీటికి సంబంధించి ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తి కాగా, పలు ప్రాంతాల్లో పనులు కూడా ప్రారంభమయ్యాయి. వీటికి తోడు నగరంలో ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేందుకు నగరంలోని అన్ని పార్క్ స్థలాలను అభివృద్ధి చేసి స్థానికంగా ఉండే ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తున్నారు. నగరంలోని మానేర్ డ్యాం కట్ట వెంట కూడా సుందరీకరణతో పాటు ప్రజలు వినియోగించుకునేందుకు వీలుగా పలు పనులు చేపడుతు న్నారు.
పద్మనగర్ నుంచి గౌతమీనగర్ మీదుగా ఉజ్వల పార్క్ వరకు కూడా పూర్తిస్థాయిలో సుందరీకరణ చేయడంతో పాటు ఇతర సౌకర్యాల కల్పనకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. మానేర్ రివర్ ఫ్రంట్కు అనుసంధానంగా ఈ ప్రాంతాన్ని కూడా పర్యాటకంగా తీర్చిదిద్దే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే స్మృతివనం ఏర్పాటుకు స్థలాన్ని కూడా పరిశీలించారు. ప్రస్తుతం మానేర్ డ్యాం వద్ద అధికసంఖ్యలో నగరవాసులు వాకింగ్ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో డ్యాం కట్ట వెంట పూర్తిస్థాయిలో వాకింగ్ ట్రాక్, సైక్లింగ్ ట్రాక్ నిర్మాణానికి నగరపాలక అధికారులు ప్రణాళికలు, ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే పలు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి.
రూ.45 లక్షలతో పనులు
డ్యాం కట్ట వెంట చేపట్టే వాకింగ్ ట్రాక్ నిర్మాణంలో భాగంగా గౌతమీనగర్ రిజర్వాయర్ నుంచి బ్లాక్ 10 వరకు వాకింగ్, సైక్లింగ్ ట్రాక్ను అభివృద్ధి చేసేందుకు అధికారులు రూ.45 లక్షలతో ప్రతిపాదించారు. ఇందుకు ఇటీవల జరిగిన నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశం కూడా ఆమోదం తెలిపింది. పనులను వేగంగా చేపట్టే దిశగా అధికారులు యత్నిస్తున్నారు. ఈ వేసవిలోనే టెండర్ల ప్రక్రియ పూర్తి చేయడంతో పాటు పనులను కూడా వేగంగా ప్రారంభించేందుకు కసరత్తు ప్రారంభించారు. డ్యాం కట్ట వెంట సుందరీకరణలో భాగంగా ఈ పనులను మొదటి విడుతలో చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. నిర్మాణం పూర్తి చేసి ప్రజల నుంచి వచ్చే అభిప్రాయాల అనంతరం కట్ట వెంట పూర్తిస్థాయిలో చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొంటున్నారు.