నయీంనగర్, మార్చి19: వేయి స్తంభాల గుడిపై కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్నదని ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ ఆరోపించారు. ఆదివారం హనుమకొండలోని వేయి స్తంభాల దేవాలయాన్ని సందర్శించిన ఆయన మీడియాతో మాట్లాడారు. వివాదాల కోసం ఆలయాల గురించి మాట్లాడే బీజేపీ ప్రభుత్వానికి ఈ ప్రాచీన ఆలయం కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. రాష్ట్రానికి చెందిన కిషన్రెడ్డి కేంద్ర పర్యాటక మంత్రిగా ఉన్నా వరంగల్లోని వేయి స్తంభాల గుడి పునర్నిర్మాణం పనులు ముందుకు సాగడం లేదని విమర్శించారు. ఈ ఆలయ పర్యవేక్షణ అంతా కేంద్ర పురావస్తు శాఖ పరిధిలోనే ఉన్నదని, రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి పనులు చేసేందుకు అనుమతి లేదని తెలిపారు. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఆలయ ఆవరణలో మౌలిక వసతులు కల్పించిందని అన్నారు. రూ.20 కోట్లతో వేయి స్తంభాల గుడి ప్రధాన ద్వారం నుంచి వరంగల్-హనుమకొండ ప్రధాన రహదారికి మధ్య ప్రాంతాన్ని రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేసిందని చెప్పారు. ఆలయం ప్రధాన ద్వారం ముందు రూ. కోటితో బ్యూటిఫికేషన్ చేసినట్టు తెలిపారు.
వేయి స్తంభాల దేవాలయంలో నిర్వహించే ఉగాది వేడుకలకు కేంద్ర పురావస్తు శాఖకు రూ.25వేలు కట్టాలనడం అమానుషమని దాస్యం అన్నారు. ఆ మొత్తం కడితేనే కవి సమ్మేళనాలు, పంచాంగ శ్రవణం తదితర కార్యక్రమాలు ఉంటాయని, లేకుంటే అనుమతివ్వమని కేంద్ర పురావస్తు శాఖ ఇచ్చిన జీవో ను వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. గత 50 ఏండ్లుగా ఉగాది వేడుకలు జరుగుతున్నాయని, ఇప్పుడు ఈ జీవో హిందూ మనోభావాలు దెబ్బతిసే విధంగా ఉన్నదని మండిపడ్డారు. కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ఇలాంటి జీవోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ప్రధాన అర్చకులు గంగు ఉపేంద్రశర్మ తపాల్గొన్నారు.