సిటీబ్యూరో, ఫిబ్రవరి 13 (నమస్తే తెలంగాణ): మహారాష్ట్ర పుణేలోని గూగుల్ కార్యాలయానికి బాంబు బెదిరింపు కాల్ చేసిన ఓ వ్యక్తిని ముంబై పోలీసులు హైదరాబాద్లో అరెస్టు చేశారు. చందానగర్కు చెందిన దయానంద్, శివానంద్లు అన్నదమ్ములు. దయానంద్.. పుణేలోని గూగుల్ కార్యాలయంలో పనిచేస్తున్నాడు.
ఆస్తి పంపకాల కోసం దయానంద్ను శివానంద్ పిలిస్తే ఎంతకూ రాలేదు. దీంతో ఫోన్ చేసి మీ కార్యాలయాన్ని పేల్చివేస్తానంటూ సోదరుడు దయానంద్ను బెదిరించాడు. అంతటితో ఊరుకోకుండా గూగుల్ కార్యాలయంలో బాంబు ఉందంటూ సిబ్బందికి ఫోన్ చేశాడు. దీంతో వారు స్థానిక పోలీసులకు సమాచారం అందించగా, దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఫోన్ కాల్ ట్రాక్ చేసి, నిందితుడిని అరెస్టు చేశారు.