హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజనం పథకం కార్మికులకు గుడ్న్యూస్ తెలిపింది . కార్మికులకు పెంచిన వేతనాలు ఈ నెల నుంచే అందజేయనున్నట్లు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి (Minister Sabita Indra reddy ) వెల్లడించారు. శనివారం రాజేంద్రనగర్లోని తెలంగాణ గ్రామీణాభివృద్ధి సంస్థలో జరిగిన జిల్లా విద్యాశాఖాధికారుల సమావేశంలో ఆమె మాట్లాడారు.
వేతనాల ( Wages )ను పెంచడం వల్ల ప్రస్తుతం రాష్ట్రంలోని వివిధ పాఠశాలల్లో పని చేస్తున్న 54,201 మంది కుక్-కమ్ హెల్పర్లకు( Cook cum Helpers ) లబ్ధి చేకూరుతుందని వెల్లడించారు. పెంచిన వేతనాల వల్ల సంవత్సరానికి రూ.108 .40 కోట్ల అదనపు భారం ప్రభుత్వంపై పడుతుందని పేర్కొన్నారు. మధ్యాహ్న భోజన పథకాని (Midday meals ) కి సంబంధించిన నిధులను ఎప్పటికప్పుడు విడుదల చేయాలని ఆదేశించారు. విద్యార్థులకు నాణ్యతతో కూడిన ఆహారాన్ని అందించాలని, పర్యవేక్షణ పెంచాలని సూచించారు.
పాఠశాల విద్యలో ప్రధానంగా ప్రాథమిక స్థాయిలో చోటు చేసుకున్న అభ్యసన సంక్షోభాన్ని నివారించి తరగతి వారిగా భాషా, గణితాల సామర్థ్యాలను సాధించేందుకు తొలి మెట్టు కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని వివరించారు. తొలిమెట్టును విజయవంతంగా అమలుచేసేందుకు ఈ సంవత్సరం ప్రత్యేకంగా వార్షిక ప్రణాలికను విడుదల చేస్తున్నామని తెలిపారు. పాఠశాల స్థాయిలో విద్యార్థుల్లో ఉన్న కనీస సామర్థ్యాలను గుర్తించేందుకు ఈ సంవత్సరం నుంచి ప్రతీ ఏటా స్టేట్ లెవెల్ అచీవ్ మెంట్ సర్వే నిర్వహించనున్నామని మంత్రి వెల్లడించారు. ఈ సర్వే ఫలితాల ఆధారంగా భవిష్యత్ లో చర్యలు చేపట్టనున్నామని మంత్రి వివరించారు. పదవతరగతిలో ఉత్తమ ఫలితాల సాధన కోసం ఇప్పటి నుంచే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
మన ఊరు- మన బడి పనులను పూర్తి చేయాలి
మన ఊరు- మన బడి కార్యక్రమంలో చేపట్టిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రి సబితా ఆదేశాలు జారీ చేశారు. కోటి రూపాయల కన్నా ఎక్కువ వ్యయమయ్యే పనులను పాఠశాల నిర్వహణ కమిటీలకు (ఎస్.ఎం.సి) అప్పగించి పనులను పూర్తి చేయాలన్నారు. పలు జిల్లాల్లో విద్యార్థులకు అందజేయాల్సిన ఏకరూప దుస్తులు అందలేదన్న ఫిర్యాదులు వస్తున్నాయని, మరో వారం రోజుల్లోగా అందజేయకపోతే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు.
ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థుల నమోదు శాతం పెరిగేలా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో విద్యా శాఖ కార్యదర్శి వాకాటి కరుణ, పాఠశాల విద్యా సంచాలకులు శ్రీ దేవసేన తదితరులు పాల్గొన్నారు.