TSRTC | హైదరాబాద్ : టీఎస్ ఆర్టీసీ ఉద్యోగులకు తీపికబురు అందించింది ఆర్టీసీ యాజమాన్యం. రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా మరో డీఏ ఇవ్వాలని ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. జూన్ నెల వేతనంతో కలిపి డీఏ చెల్లించనుంది. ఉద్యోగులకు డీఏ ఇస్తున్నట్లు ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్, చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ ప్రకటించారు.
జులై 2022 లో ఇవ్వాల్సి ఉన్న 4.9 శాతం డీఏను మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. జూన్ నెల వేతనంతో కలిపి డీఏను ఉద్యోగులకు సంస్థ చెల్లిస్తుందని ప్రకటించారు.
తెలంగాణ ఉద్యమంలో టీఎస్ఆర్టీసీ ఉద్యోగులు క్రియాశీల పాత్ర పోషించారు. 2011లో దాదాపు 29 రోజుల పాటు సకల జనుల సమ్మెలో పాల్గొని ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల కానుకగా పెండింగ్ లో ఉన్న ఏడో డీఏను ఉద్యోగులకు మంజూరు చేయాలని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. క్లిష్ట పరిస్థితుల్లోనూ ఇప్పటివరకు ఏడు డీఏలను సంస్థ మంజూరు చేసింది. మిగిలిన ఒక్క డీఏను త్వరలోనే ఉద్యోగులకు ప్రకటిస్తుంది అని టీఎస్ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్, సంస్థ ఎండీ వీసీ సజ్జనర్ తెలిపారు.