హైదరాబాద్, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని 71,400 మంది అంగన్వాడీలు, సహాయకుల జీవితాల్లో రాష్ట్ర ప్రభుత్వం శాశ్వత వెలుగు నింపింది. వీరి పదవీ విరమణ వయసును 65 ఏండ్లకు పెంచింది. రాష్ట్రంలోని 3,989 మినీ అంగన్వాడీ కేంద్రాలను మెయిన్ అంగన్వాడీలుగా మారుస్తూ సీఎం కేసీఆర్ శుక్రవారం నిర్ణయం తీసుకొన్నారు. అంగన్వాడీ టీచర్లు, సహాయకుల పదవీ విరమణ వయసును 65 ఏండ్లకు పెంచుతూ వారికి పదవీ విరమణ బెనిఫిట్స్ ఇవ్వాలని నిర్ణయించారు. ఇప్పటికే ఫైల్పై సీఎం సంతకం చేశారు. దీంతో అంగన్వాడీలు సంబురాలు చేసుకొంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు చెప్పారు. సీఎం కేసీఆర్ వేలమంది అంగన్వాడీల జీవితాల్లో వెలుగులు నింపారని రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ సంతోషం వ్యక్తంచేశారు.
దశాబ్దాలుగా పనిచేస్తున్న తమకు వేతన భద్రత లేదని, పదవీ విరమణ అనంతరం తగిన గౌరవం దక్కటంలేదని అంగన్వాడీలు, సహాయకులు దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నారు. మెయిన్ అంగన్వాడీలతో సమానంగా పనిచేస్తున్న తమకు సరైన గుర్తింపులేదని మినీ కేంద్రాల అంగన్వాడీలు కొట్లాడుతున్నారు. వీటిని కూడా మెయిన్ అంగన్వాడీ కేంద్రాలుగా అప్గ్రేడ్ చేయాలని ఎంతోకాలంగా కోరుతున్నారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ అసాధారణ నిర్ణయం తీసుకున్నారు. పదవీ విరమణ సమయంలో అంగన్వాడీ టీచర్లకు రూ.1 లక్ష, సహాయకులకు రూ.50 వేలు చెల్లించాలని నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్లో టీచర్లకు రూ.50 వేలు, సహాయకులకు రూ.25 వేలు ఇస్తున్నారు.
మినీ అంగన్వాడీ కేంద్రాల సమస్యలు పరిష్కరించాలని కేంద్ర ప్రభుత్వానికి ఎన్ని విజ్ఞప్తులు చేసినా పట్టించుకోలేదు. కానీ, రాష్ట్ర ప్రభుత్వం మినీ అంగన్వాడీల సేవలను గుర్తించింది. రాష్ట్ర సాధన అనంతరం మెయిన్ అంగన్వాడీ కేంద్రాలకు ఏ స్థాయిలో అయితే గుర్తింపు, గౌరవం అందుతున్నాయో మినీ అంగన్వాడీలకు అదేహోదా కల్పిస్తున్నది. వేతనాలు పెంపు, సెలవుల విషయంలోనూ సమాన గౌరవాన్ని కల్పించింది. కేంద్రంలో మోదీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు అంగన్వాడీల వేతనాల్లో కేంద్రం వాటా 90 శాతం, రాష్ట్ర ప్రభుత్వాల వాటా 10 శాతం ఉండేది. మోదీ సర్కారు ఆ వాటాను 60-40 శాతానికి మార్చింది. అదికూడా సరిగా అమలుచేయటం లేదు. రాష్ట్రంలో పెరిగిన వేతనాల ప్రకారం కేంద్ర వాటా 60 శాతం ఉండాలి. కానీ, అంగన్వాడీ టీచర్ల వేతనాల్లో 19 శాతం, సహాయకుల వేతనాల్లో 17 శాతం మాత్రమే కేంద్రం ఇస్తున్నది. మిగతాదంతా రాష్ట్రప్రభుత్వమే భరిస్తున్నది.
రాష్ట్రంలో ప్రస్తుతం 35,700 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. ఇందులో 31,711 ప్రధాన కేంద్రాలుకాగా, 3,989 మినీ అంగన్వాడీ కేంద్రాలు. వీటిలో మొత్తం 71,400 మంది పనిచేస్తున్నారు. ప్రధాన అంగన్వాడీలో ఒక టీచర్, ఒక సహాయకురాలు ఉంటారు. మినీ అంగన్వాడీలో ఒక్కరే కార్యకర్త, లేదా మినీ అంగన్వాడీ టీచర్ ఉంటారు. మినీ కేంద్రాలను అప్గ్రేడ్ చేయటం వల్ల ఇక్కడా మరొక సహాయకురాలి సేవలు అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తండాలను గ్రామ పంచాయతీలు చేయటం వల్ల మినీ కేంద్రాల పరిధి, సేవలు విస్తరించాల్సిన అవసరం ఏర్పడిందని గుర్తించిన ప్రభుత్వం వీటి ఉన్నతీకరణకు నిర్ణయం తీసుకున్నది. అయితే మినీ కేంద్రాలను అప్గ్రేడ్ చేసే క్రమంలో ప్రస్తుతం వాటిల్లో పనిచేస్తున్నవారి విద్యార్హతలను పరిగణనలోకి తీసుకోవాలా? లేదా వీరినే అప్గ్రేడ్ చేయాలా? అన్న విషయాన్ని పరిశీలించి రెండుమూడు రోజుల్లో విధివిధానాలు రూపొందించే అవకాశాలున్నాయని సంబంధిత శాఖ ఉన్నతాధికారులు తెలిపారు.
అంగన్వాడీ టీచర్లకు అత్యధిక వేతనాలు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. ఏకైక ముఖ్యమంత్రి కేసీఆరే. అంగన్వాడీలను వరర్లు అనకుండా టీచర్లుగా సంబోధించాలని ఆదేశాలు ఇచ్చినా, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా 30 శాతం పీఆర్సీ పెంచినా కేసీఆరే చేస్తారనే నమ్మకం అంగన్వాడీల్లో నెలకొన్నది. తెలంగాణ రాష్ట్రం మహిళల సాధికారత, సమగ్రసేవల, రక్షణ, పోషణ, ఆరోగ్యం కోసం దేశంలోనే అత్యుత్తమంగా పనిచేస్తున్న వ్యవస్థను మరింత బలోపేతం చేయటంలో అంగన్వాడీల కృషిని సీఎం కేసీఆర్ గుర్తించినందుకు కృతజ్ఞతలు. సంబంధిత శాఖకు నేను మంత్రిగా ఉన్నప్పుడు ఇంత గొప్ప మార్పులు జరగడం తన పూర్వజన్మ సుకృతం.
– స్త్రీ, శిశు, గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్
అంగన్వాడీ టీచర్లు, హెల్పర్స్కు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ప్రకటించినందుకు సీఎం కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం కృషి చేసిన మంత్రులు హరీశ్రావు, కేటీఆర్, ఎమ్మెల్సీలు కల్వకుంట్ల కవిత, పల్లా రాజేశ్వర్రెడ్డికి ధన్యవాదాలు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించటం కోసం అహర్నిశలు కృషి చేసిన మంత్రి సత్యవతి రాథోడ్కు ప్రత్యేక కృతజ్ఞతలు.
– నల్లా భారతి, తెలంగాణ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (బీఆర్టీయూ)
3,989 మంది మినీ అంగన్వాడీ టీచర్లను ఎలాంటి షరతులు లేకుండా సీఎం కేసీఆర్ మెయిన్ అంగన్వాడీలుగా అప్గ్రేడ్ చేసి మా జీవితాలను మార్చారు. గత ఏడు సంవత్సరాలుగా మినీ అంగన్వాడీ టీచర్లు ఎలాంటి ధర్నాలు చేయకుండా, ప్రభుత్వానికి సామరస్యంగా మా సమస్యను విన్నవించాం. సీఎం కేసీఆర్ దృష్టికి మా సమస్యలు వెళ్తే తప్పకుండా న్యాయం జరుగుతుందన్న మా నమ్మకం నిజమైంది. మెయిన్ అంగన్వాడీ కేంద్రాలుగా ఉన్నతీకరించటంలో మా యూనియన్ గౌరవ అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవితకు, మంత్రి సత్యవతి రాథోడ్కు కృతజ్ఞతలు.
– ఆడెపు వరలక్ష్మి, తెలంగాణ మినీ అంగన్వాడీ టీచర్స్ యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షురాలు
అంగన్వాడీ టీచర్లకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పిస్తూ మానసిక ధైర్యాన్ని నింపి, ప్రభుత్వ పథకాలకు అర్హులుగా మార్చిన సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు. మినీ కేంద్రాలను అప్గ్రేడ్ చేస్తూ సీఎం కేసీఆర్ మానవీయ నిర్ణయం తీసుకున్నారు. ఇంత గొప్ప నిర్ణయం తీసుకొన్న సీఎం కేసీఆర్, మంత్రులు సత్యవతి రాథోడ్, కేటీఆర్, హరీశ్రావుకు ప్రత్యేక ధన్యవాదాలు.
-ఎం భిక్షపమ్మ, తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ (టీఎన్జీవో)