ఆలేరు: ఎమ్మెల్యే గొంగిడి సునీత తన బిడ్డ అని, నియోజకవర్గ అభివృద్ధి కోసం ఆమె తన ముందు పెట్టిన డిమాండ్లు అన్నింటిని తప్పకుండా నెరవేరుస్తానని సీఎం కేసీఆర్ ఆ నియోజకవర్గ ప్రజలకు హామీ ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం సాయంత్రం ఆలేరు నియోజకవర్గంలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. గొంగిడి సునీత సునాయాసంగా ఎమ్మెల్యే కాలేదని, ఆమె రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చిందని చెప్పారు.
సునీత ఎంతో సౌమ్యురాలని, నియోజకవర్గ ప్రజలు సమస్య చెప్పుకునేందుకు వస్తే శాంతంగా వారి సమస్యను విని పరిష్కారం చూపిస్తుందని సీఎం చెప్పారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇప్పుడు మూడోసారి అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయని, ఈ ఎన్నికల్లో కూడా గొంగిడి సునీతకు అండగా నిలిచి ఘన విజయం కట్టబెట్టాలని ఓటర్లను కోరారు. సునీత మళ్లీ గెలిస్తే ఆలేరు నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు.