హైదరాబాద్, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర ఏర్పాటను మొదటి నుంచీ వ్యతిరేకిస్తున్న వ్యక్తి ప్రధాని నరేంద్ర మోదీ. ‘తల్లిని చంపి బిడ్డను బతికించారు’ అంటూ ఏకంగా రాష్ట్ర అవతరణనే అవమానించిన ఆయన.. తెలంగాణను ‘బంగారు తెలంగాణ’గా మార్చాలని కలలు కన్నారట. ఈ విషయాన్ని స్వయంగా బీజేపీ రాష్ట్రవ్యవహారాల ఇంచార్జి తరుణ్ చుగ్ చెప్పడం విశేషం. మునుగోడులో శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఎమ్మెల్యేల కొనుగోలు కుట్రపై మళ్లీ పాతపాటే పాడారు. ఈ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వమే నాటకమాడుతున్నదని వల్లె వేశారు.
‘బంగారు తెలంగాణ కోసం మోదీ కలలు కన్నారు’ అని చెప్పి నవ్వులపాలయ్యారు. తరుణ్ చుగ్ వ్యాఖ్యలు ఈ శతాబ్దానికే పెద్ద జోక్ అంటూ తెలంగాణ ప్రజలు మండిపడుతున్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా మోదీ కక్ష కొనసాగుతూనే ఉన్నదని, రాష్ర్టానికి నిధులు, ప్రాజెక్టుల కేటాయింపులో అడుగడుగునా వివక్ష ప్రదర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మునుగోడులో బీజేపీ నిర్వహిస్తున్న సభలు, ర్యాలీలకు ప్రజల నుంచి స్పందన కరువైంది. కిరాయికి తెచ్చుకున్నవారు సైతం ఆ సోదిని భరించలేక బండి సంజయ్ లాంటి ముఖ్యనేతలు ప్రసంగిస్తుండగానే వెళ్లిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో 31న నడ్డా బహిరంగ సభకు ప్రజలు రారని బీజేపీకి అర్థమవడం వల్లనే ఆ సభను రద్దు చేసింది. దీన్ని కవర్ చేసుకోవడానికి బండి సంజయ్ నానా తిప్పలు పడుతున్నారు.