సిద్దిపేట: కాళేశ్వర జలాల విడుదలపై బీఆర్ఎస్ పోరాటం ఫలించింది. మల్లన్నసాగర్లోకి (Mallanna Sagar) సాగునీటిని ప్రభుత్వం విడుదల చేసింది. రంగనాయక సాగర్ నుంచి మల్లన్నసాగర్లోకి నీటిని ఎత్తిపోస్తున్నది. గోదావరి జలాలు సముద్రంపాలవుతున్నా రాజకీయ కక్షతో ప్రభుత్వం కాళేశ్వరం నుంచి నీటిని విడుదల చేయలేదు. దీంతో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతులు ఉద్యమ బాటపట్టారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీశ్రావు హెచ్చరికలతో దిగివచ్చిన ప్రభుత్వం కాళేశ్వరం పరిధిలోని రిజర్వాయర్లకు నీటిని విడుదల చేస్తున్నది.
వర్షాభా పరిస్థితులతో సిద్దిపేట జిల్లాలోని రిజర్వాయర్లు వట్టిపోతున్నాయని, కాళేశ్వర జాలాలతో వాటిని నింపి రైతాంగాన్ని ఆదుకోవాలని ఎమ్మె ల్యే హరీశ్రావు ఇటీవల నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డికి లేఖ రాసిన విషయం తెలిసిందే. దీంతో స్పందించిన ప్రభుత్వం అనంతగిరి రిజర్వాయర్ నుంచి నీటిని ఎత్తిపోసే ప్రక్రియను ప్రారంభించింది. మంగళవారం రెండు మోటర్లను ఆన్చేయడంతో గోదావరి జలాలు రంగనాయకసాగర్లోకి పరుగులు పెట్టాయి. 3 టీఎంసీల సామర్థ్యంగల రంగనాయకసాగర్లోకి రెండు పంపుల ద్వారా 6600 క్యూసెక్కుల నీటిని ప్రాజెక్టులోకి ఎత్తిపోస్తున్నారు. తాజాగా రంగనాయక సాగర్ నుంచి మల్లన్నసాగర్లోకి నీటిని ఎత్తిపోస్తున్నారు. 50 టీఎంసీల సామర్థ్యంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం మల్లన్న సాగర్ను నిర్మించిన విషయం తెలిసిందే. ఇక కొండపోచమ్మ సాగర్కు గురువారం రాత్రికి గోదావరి జలాలు చేరనున్నాయి.
శనివారం వరకు నీటిని ఎత్తిపోసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని, అప్పటి వరకు నీటి లభ్యతను బట్టి గోదావరి జలాలు ఎత్తిపోయనున్నట్లు అధికారులు తెలిపారు. గోదావరి జలాలతో నింపుతుండటంతో ఆయకట్టు పరిధిలోని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ పోరాటంతోనే నీటి విడుదల జరిగిందని సంతోషం వ్యక్తంచేస్తున్నారు.
కాళేశ్వరం పనికిరాదు అన్నారు కానీ అదే కాళేశ్వరం వాడక తప్పని పరిస్థితి
రంగనాయక్ సాగర్ రిజర్వాయర్ నుండి మల్లన సాగర్ రిజర్వాయర్కు కాళేశ్వరం నీటిని విడుదల చేస్తున్న దృశ్యాలు pic.twitter.com/04S4nyyTUe
— Telugu Scribe (@TeluguScribe) August 8, 2024