భద్రాచలం: భద్రాచలం (Bhadrachalam) వద్ద గోదావరి నీటిమట్టం మళ్లీ పెరుగుతున్నది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో ఎగువన నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతున్నది. దీంతో సోమవారం నుంచి వరద ప్రవాహం క్రమంగా పెరుగుతూ వస్తున్నది. మంగళవారం ఉదయం 45 దాటింది. దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీచేశారు. ప్రస్తుతం భద్రాచలం వద్ద 9 లక్షల 46 వేల 412 క్యూసెక్కుల వరద నీరు దిగువకు విడుదలవుతోంది. వరద మరింత పెరిగే అవకాశం ఉండడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీచేశారు.
కాగా, భారీ వర్షాలతో ప్రాజెక్టులన్నీ నిండుకుండలుగా మారాయి. దీంతో అధికారులు గేట్లు ఎత్తి వరద నీటిని దిగువకు విడుదల చేస్తుండటంతో గోదావరి వరద అంతకంతకూ పెరుగుతున్నది. ఇంద్రావతి, ప్రాణహిత నదుల నుంచి గోదావరిలోకి లక్షల క్యూసెక్కుల వరద వస్తున్నది. చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టుకు ఛత్తీస్గఢ్ నుంచి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతున్నది. సోమవారం నుంచి లక్షన్నర క్యూసెక్కుల నీటిని దిగువన ఉన్న గోదావరిలోకి అధికారులు విడుదల చేస్తున్నారు. కాగా, గోదావరి ప్రవాహం 48 అడుగులకు చేరితే రెండో ప్రమాద హెచ్చరికను జారీచేయనున్నారు.