భద్రాచలం: గోదావరి మరోసారి ఉగ్రరూపం దాల్చింది. వరద పోటెత్తడంతో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 52.5 అడుగులకు చేరింది. దీంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగిస్తున్నారు. నీటిమట్టం 53 అడుగులు దాటితే మూడో ప్రమాద హెచ్చరిక జారీచేయనున్నారు. గోదావరిలో ప్రస్తుతం 13.98 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం ఉన్నది. దీంతో అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు.
గోదావరిలో భారీగా వరద ప్రవహిస్తుండటంతో రోడ్డుపైకి నీరు చేరి మండలాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. భద్రాచలం నుంచి దుమ్ముగూడెం, చర్ల, కూనవరం, వీఆర్పురం, చింతూరు మండలాలకు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.