భద్రాచలం వద్ద 63 అడుగులు
60 అడుగులు దాటడం ఇది ఆరోసారి
మరోసారి 3వ ప్రమాద హెచ్చరిక జారీ
గంటగంటకూ మారుతున్న ప్రవాహం
ప్రవాహ వేగంలో తీవ్ర హెచ్చుతగ్గులు
కడెం ప్రాజెక్టుకు తప్పిన ముప్పు
హైదరాబాద్/ నమస్తే తెలంగాణ నెట్వర్క్, జూలై 13: గోదావరి నది మహోగ్రరూపం దాల్చింది. గంటగంటకూ ప్రవాహ వేగం మారుతున్నది. భద్రాచలం వద్ద బుధవారం 63 అడుగుల మేర ప్రవహిస్తున్నది. 1976 తరువాత భద్రాచలం వద్ద 60 అడుగులు దాటి ప్రవహించడం ఇది ఆరోసారి అని అధికారులు చెప్తున్నారు. దీంతో కలెక్టర్ రెండోసారి మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ భద్రాచలంలోనే బస చేసి ఎప్పటికప్పుడు యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తున్నారు.
కాళేశ్వరం పుష్కరఘాట్ వద్ద రెండో హెచ్చరిక
గోదావరి నది కాళేశ్వరం పుషరఘాట్ వద్ద 15 మీటర్లు ఎత్తును దాటి ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నది. దీంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. గోదావరి ఒడ్డుపై ఉన్న ఇండ్లలోని ప్రజలను ఖాళీ చేయించారు. రామన్నగూడెం వద్ద గోదావరి నది 16.4 మీటర్లు, పేరూరు వద్ద 16.1 మీటర్లకు చేరుకొన్నది. పేరూరు వద్ద 3వ ప్రమాద హెచ్చరిక, రామన్నగూడెం వద్ద 2వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఎస్సారెస్పీ, ఎల్లంపల్లి, నిజాంసాగర్, కడెం, మేడిగడ్డ వద్ద కూడా వరద ప్రవాహం కొనసాగుతున్నది. మూడు రోజులుగా ఎడతెగకుండా కురుస్తున్న వర్షాలతో గోదావరి బేసిన్లో 11వేల చెరువులు మత్తళ్లు దుంకుతున్నాయి. మొత్తంగా 18 పెద్ద చెరువులు తెగిపోగా, 161 చోట్ల కాలువలు, కుంటలు, తూములు దెబ్బతిన్నట్టు అధికారులు తెలిపారు.
నేడు ధవళేశ్వరం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక?
ఆంధ్రప్రదేశ్లోని ధవళేశ్వరం వద్ద గోదావరి పోటెత్తింది. బుధవారం ఇన్ ఫ్లో, ఔట్ఫ్లో 15.07 లక్షల క్యూసెక్కులు ఉన్నట్టు అధికారులు తెలిపారు. గురువారం మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉన్నదని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు స్పిల్వే నుంచి ప్రస్తుతం 15.91 లక్షల క్యూసెక్కుల వరద ప్రవహిస్తున్నట్టు అధికారులు పేర్కొన్నారు. భారీ స్థాయిలో వస్తున్న వరద ప్రవాహాన్ని మళ్లించేందుకు స్పిల్వేలోని 48 క్రస్ట్ గేట్లను ఎత్తివేసి నీటిని కిందకు వదులుతున్నారు. దీంతో పాటు రివర్ స్లూయిస్ గేట్ల ద్వారా కూడా వరద ప్రవాహం దిగువకు వెళ్తున్నది.
మెదక్-కామారెడ్డి జిల్లాల సరిహద్దులో పరవళ్లు దుంకుతున్న పోచారం ప్రాజెక్టు
దేవాదుల ఫేజ్ -3 పనులకు ఆటంకం
గోదావరి వరదల కారణంగా దేవాదుల ఎత్తిపోతల పథకం ఫేజ్-3లోని ప్యాకేజ్-3 పనులకు ఆటంకం ఏర్పడింది. ప్యాకేజ్-3లోని టన్నెల్, పంప్హౌస్, సర్జ్పూల్లకు భారీ నష్టం వాటిల్లింది. ప్రస్తుతం ములుగు జిల్లా రామప్ప నుంచి హనుమకొండ జిల్లా ధర్మసాగర్ వరకు సాగుతున్న పనులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఆసియాలోనే అతి పెద్ద వర్టికల్ సర్జ్పూల్ పనులు పూర్తి కావొస్తున్న దశలో వరదలు ముంచెత్తడంతో నిర్మాణం జాప్యం కావొచ్చని భావిస్తున్నారు.
లక్ష్మీబరాజ్లో 85 గేట్లు ఎత్తివేత
కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని బరాజ్లకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద 50 గేట్లు ఎత్తి 11,69,515 క్యూసెక్కుల నీటిని దిగువకు వదలడంతో పార్వతీ బరాజ్లోకి వరదనీరు పోటెత్తింది. దీంతో పార్వతీబరాజ్ వద్ద 72 గేట్లు, సరస్వతీ బరాజ్ వద్ద 66 గేట్లు, లక్ష్మీబరాజ్ వద్ద 85 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదలచేస్తున్నారు.
సురక్షితంగా కడెం ప్రాజెక్టు
నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టు తెగిపోయిందంటూ జరుగుతున్న ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని రాష్ట్ర సాగునీటిశాఖ విజ్ఞప్తి చేసింది. భారీ వర్షాల కారణంగా కడెం ప్రాజెక్టులోకి 5 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా, 3 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నట్టు వెల్లడించింది. కడెం ప్రాజెక్టులోకి వరద ఉద్ధృతి ఎక్కువగా ఉన్నప్పటికీ పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉన్నదని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నీటిపారుదలశాఖ అధికారులు స్పష్టంచేశారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ముంపు గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్టు పేర్కొన్నారు. మీడియా అవాస్తవాలను ప్రసారం చేయవద్దని, వాస్తవాలను క్రాస్ చెక్ చేసుకోవాలని కోరారు.
శ్రీశైలానికి కృష్ణమ్మ పరుగులు
కర్ణాటకలో కురుస్తున్న వర్షాలతో తుంగభద్ర, కృష్ణా నదిలో వరద ప్రవాహం పెరుగుతున్నది. బుధవారం కర్ణాటకలోని ఆల్మట్టి నుంచి 1.25 లక్షల క్యూసెక్కులు, నారాయణపుర నుంచి 1.33 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. దీంతో జూరాల ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. ప్రాజెక్టు అధికారులు 18 గేట్లు ఎత్తి 1,07,865 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. కృష్ణా,తుంగభద్ర వరదలతో శ్రీశైలం జలాశయానికి లక్ష క్యూసెక్కులకు పైగా వరదనీరు వచ్చి చేరింది. గురువారం ఉదయానికి ఇన్ఫ్లో 2 లక్షల క్యూసెక్కులకు చేరుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. తుంగభద్ర డ్యాంకు వద్ద 30 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.