కొత్తగూడె: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాతోపాటు, గోదావరి పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నదికి వరద పోటెత్తుతున్నది. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రికి భద్రాచలం (Bhadrachalam) వద్ద గోదారమ్మ 43 అడుగులకు చేరుకునే అవకాశం ఉందని సిడబ్ల్యూసీ వెల్లడించింది. దీంతో భద్రాచలం వద్ద అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీచేయనున్నారు. ప్రస్తుతం 30 అడుగుల వద్ద నది ప్రవహిస్తున్నదని చెప్పారు.
గోదావరి ప్రవాహం పెరుగుతుంటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ అనుదీప్ హెచ్చరించారు. ముంపునకు గురయ్యే ప్రజలు పునరావాస కేంద్రాలకు వెళ్లాలని సూచించారు. పశువులను మేతకు విడిచిపెట్టకుండా ఎత్తయిన ప్రాంతాలకు తరలించాలన్నారు. అత్యవసర సేవల కోసం హెల్ప్లైన్ నంబర్లకు ఫోన్ చేయాలని, వాగులు, వంకలు, పంట కాలువలు దాటే ప్రయత్నం చేయొద్దన్నారు.
కలెక్టర్ కార్యాలయం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని, ఫోన్ నంబర్ 08744-241950, వాట్సప్ నంబర్ 93929 29743, ఆర్డీవో కార్యాలయం కంట్రోల్ రూమ్ వాట్సప్ నంబర్ 93929 19750, భద్రాచలం సబ్కలెక్టర్ కార్యాలయం కంట్రోల్ రూమ్ 08743 232444, భద్రాచలం సబ్కలెక్టర్ కార్యాలయం వాట్సప్ నంబర్ 63024 85393లో సంప్రదించవచ్చని సూచించారు.