ఖమ్మం, జూలై 19 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): భద్రాచలం వద్ద గోదావరి మంగళవారం మరింత తగ్గుముఖం పట్టింది. మంగళవారం తెల్లవారుజామున 4 గంటలకు 55.8 అడుగులుగా ఉన్న నీటిమట్టం రాత్రి 7 గంటలకు 3వ ప్రమాద హెచ్చరికకు దిగువన 49 అడుగులకు చేరింది. వరద ప్రవాహం క్రమేణా తగ్గుతుండటంతో జల దిగ్బంధంలోంచి లోతట్టు ప్రాంతాలు ఇప్పుడిప్పుడే తేరుకొంటున్నాయి.
మరోవైపు భద్రాచలం, దుమ్ముగూడెం, చర్ల, పర్ణశాల, బూర్గంపహాడ్, సారపాక, అశ్వాపురం, పినపాక, మణుగూరు తదితర ప్రాంతాల్లో సహాయక, పునరావాస చర్యలు కొనసాగుతున్నాయి. అయితే భద్రాచలం ఎగువ ప్రాంతాల్లో గల ప్రాజెక్టులకు వరద నీటి ప్రవాహం ఉధృతంగా ఉండటంతో ఏ క్షణమైనా భద్రాచలం వద్ద కూడా గోదావరి వరద నీటిమట్టం మరికొంత పెరిగే ప్రమాదం ఏర్పడింది. దీంతో మూడో ప్రమాద హెచ్చరికను యథావిధిగా కొనసాగిస్తున్నట్టు భద్రాద్రి కలెక్టర్ అనుదీప్ తెలిపారు.