బీబీనగర్: యాదాద్రి భువనగిరి జిల్లా బీబీ నగర్ వద్ద గోదావరి ఎక్స్ప్రెస్కు పెను ప్రమాదం తప్పింది. విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వస్తున్న గోదావరి ఎక్స్ప్రెస్ రైలు బీబీనగర్ వద్ద బుధవారం ఉదయం పట్టాలు తప్పింది. రైలులోని ఐదు బోగీలు పట్టాలపైనుంచి పక్కకు జరిగాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అయితే ఎవరికీ ఎలాంటి హాని జరుగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.
సమాచారం అందుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదం జరగడానికి గల కారణాలు తెలుసుకుంటున్నారు. బోగీలను తిరిగి పట్టాలపైకి ఎక్కించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ప్రయాణికులంతా క్షేమంగా ఉన్నారని అధికారులు తెలిపారు. ప్రయాణికులను బస్సుల్లో వారి గమ్యస్థానాలకు పంపిచామన్నారు. కాగా, గోదావరి ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పడంతో పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి.
విశాఖపట్నం-హైదరాబాద్ మధ్య గోదావరి ఎక్స్ప్రెస్ (12727) రాకపోకలు సాగిస్తున్న విషయం తెలిసిందే. ఈ రైలు విశాఖలో సాయంత్రం 5.20 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 6.15 గంటలకు నాంపల్లి స్టేషన్కు చేరుకుటుంది. ఈరైలులో వందలాది మంది ప్రయాణిస్తూ ఉంటారు.