Renewable Energy | హైదరాబాద్, డిసెంబర్ 24 (నమస్తే తెలంగాణ): శిలాజ ఇంధన వినియోగాన్ని పూర్తిగా తగ్గించి ప్రత్యామ్నాయ ఇంధన వనరులను ఉపయోగించుకునేందుకు ప్రపంచ దేశాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఈ జాబితాలో భారత్ కూడా ముందు వరుసలోనే ఉన్నది. 2032 నాటికి భారత్లో సగం విద్యుత్తు పునరుత్పాదక ఇంధన (ఆర్ఈ) వనరుల నుంచే ఉత్పత్తి అవుతుందని ప్రముఖ గ్లోబల్ ఎనలిటిక్స్ కంపెనీ ‘క్రిసిల్’ అభిప్రాయపడింది.
ప్రస్తుతం మన దేశంలో 172 గిగావాట్లుగా ఉన్న ఆర్ఈ ఇన్స్టాల్డ్ బేస్ రానున్న పదేండ్లలో మూడు రెట్లు పెరిగి 550 గిగావాట్లకు చేరుకుంటుందని క్రిసిల్ మార్కెట్ ఇంటెలిజెన్స్ అండ్ అనలిటిక్స్ నిపుణుల అంచనా వేశారు. ఇందులో 270 నుంచి 290 గిగావాట్ల సౌర విద్యుత్తు, 120 నుంచి 140 గిగావాట్ల పవన విద్యుత్తు, 40-60 గిగావాట్ల జల విద్యుత్తు ఉంటుందని విశ్లేషించారు.
నాటి సీఎం కేసీఆర్ పునర్వినియోగ ఇంధన ఉత్పత్తికి అధిక ప్రాధాన్యమిచ్చారు. దీంతో తెలంగాణ ఏర్పాటుకు ముందు రాష్ట్రంలో కేవలం 74 మెగావాట్లుగా ఉన్న సౌర విద్యుత్తు ఉత్పత్తి.. గత తొమ్మిదిన్నర ఏండ్లలో ఏకంగా 5,600 మెగావాట్లకు పెరిగింది. దీనితోపాటు ప్రస్తుతం రాష్ట్రంలో గ్యాస్ ద్వారా 807.31 మెగావాట్లు, మినీ హైడల్, బయోమాస్ ద్వారా 256.24 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి అవుతున్నది.