‘ఒంట్లో బాగోలేదని అత్తమ్మ పుట్టింటికెళ్లింది. మామయ్య ఇంటికెళ్లి.. అన్నం, కూర జేసి, సద్దికట్టి రాపో బిడ్డా..’ అంటూ చిన్నబిడ్డ సంధ్య(పేరు మార్చాము)కు చెప్పింది తల్లి. మామ వంకర చూపులను ఎప్పటి నుంచో పసిగడుతున్న సంధ్య.. ఆ రోజు ఇంటికెళ్లేందుకు జంకింది. బిడ్డ భయాన్ని గుర్తించని తల్లి.. ‘త్వరగా వెళ్లవే’ అంటూ గద్దించింది. భయంగానే వెళ్లిన సంధ్య ఇంట్లోకి అడుగుపెట్టగానే.. అమాయకంగా ఆహ్వానించాడు మామ. త్వరత్వరగా అన్నం వండి.. భయంభయంగా కూరగాయలు తరుగుతుండగానే.. వెనుక నుంచి కాటేయబోయాడు. తప్పించుకుందామని విశ్వప్రయత్నాలు చేసినా తన వల్లకాలేదు. నోరునొక్కి ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డాడు ఆ మృగాడు. ఆ మరుసటి రోజు కూడా వెళ్లి సద్దికట్టమని పంపిన తల్లితో తనపై జరుగుతున్న లైంగికదాడిని చెప్పుకొని బోరున విలపించింది సంధ్య. బిడ్డకు ధైర్యం చెప్పి కేసు పెట్టడంతో ఆ మృగాడ్ని కటకటాల్లోకి నెట్టారు పోలీసులు.
స్వాతి (పేరు మార్చాము) పాలమూరులోని ఓ మారుమూల గ్రామం నుంచి పట్నానికొచ్చింది. చదువులో రాణిస్తున్నా.. రంగుల ప్రపంచానికి ఆకర్షితురాలైంది. కొత్త స్నేహబంధాలు ఆమెను ఓ చోట నిలువనివ్వలేదు. వెంటనే స్నేహం మాటున లవ్ ప్రపోజ్ చేశాడు సుందర్ (పేరుమార్చాం). ఇద్దరిదీ ఒకే కాలేజీ. పీకల్లోతు ప్రేమలో మునిగిపోయింది స్వాతి. ఓ రోజు స్వాతి బర్త్డేని ఆమె ఊహించని విధంగా సెలబ్రేట్ చేశాడు సుందర్. ఆ రోజు రాత్రి సుందర్ కొంచెం శృతిమించాడు. ప్రేమికులకు ఇవేం కొత్త కాదన్నాడు. మొదట ససేమిరా అని పలికిన స్వాతిని.. మాయ మాటలతో నమ్మించాడు. పెండ్లి చేసుకుంటానని ప్రామిస్ చేసి, తనను లొంగదీసుకున్నాడు. లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో గర్భందాల్చిన స్వాతి.. పెండ్లి ఊసెత్తగానే కనిపించకుండా పోయాడు. ఇంటికెళ్లి అతన్నే పెండ్లి చేసుకుంటానని ధర్నాకు దిగింది స్వాతి.
హైదరాబాద్ జనవరి 22 (నమస్తే తెలంగాణ): ఆడపిల్లలకు అయినవాళ్ల దగ్గరే భద్రత కరువవుతున్నది. స్నేహం, ప్రేమ ముసుగులో ఆడబిడ్డల జీవితాలతో ఆడుకుంటున్నారు మృగాళ్లు. పెండ్లి చేసుకుంటానని నమ్మించి నిలువునా దోచేస్తున్నారు. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన పేగుబంధాలు సైతం కాలనాగులై కాటేస్తున్నాయి. ఆ బిడ్డల ఆర్తనాదాలు, కన్నీటి వ్యథలు బయటికి చెప్పకుండా బంధువులే నోళ్లు నొక్కేస్తున్నారు. కలిసి పనిచేసే ప్రదేశాల్లోనూ తెలిసినవారే లైంగికదాడులకు తెగిస్తున్నారు. ఇందుకు నిరుడు నమోదైన లైంగికదాడి కేసులే సాక్ష్యం. తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న పటిష్ట చర్యలతో అమ్మాయిల జోలికి వెళ్లేందుకు పోకిరీలు, బయటి వ్యక్తులు జంకుతున్నప్పటికీ.. స్నేహం, ప్రేమ, పెండ్లి పేరుతో అమ్మాయిలకు దగ్గరయి, వారిని వంచిస్తున్న వారే అధికంగా ఉన్నారు. మహిళలపై నేరాలకు సంబంధించి గత సంవత్సరం నమోదైన కేసుల్లో ఇలాంటివి 73 శాతం వరకు ఉన్నాయి. పనిచేసే ప్రదేశాల్లో తెలిసిన వ్యక్తులు లైంగికదాడికి పాల్పడ్డ కేసులు 15% నమోదయ్యాయి. ఇక కుటుంబసభ్యులు, బంధువులు జరిపిన లైంగక దాడులు 11% నమోదయ్యాయి.
పెండ్లి పేరుతో నయవంచన
2022లో రాష్ట్రంలో నమోదైన లైంగికదాడి కేసుల్లో పెండ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసినవే అధికంగా ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటివి 1,548 కేసులు నమోదయ్యాయి. ఈ తరహా కేసుల్లో నిందితులు అమ్మాయిలతో స్నేహం పెంచుకొని ప్రేమను వ్యక్తపరుస్తున్నారు. బాధితులు తమను పూర్తిగా నమ్మిన తర్వాత పెండ్లి చేసుకుంటానని మాట ఇచ్చి.. లైంగికదాడికి పాల్పడుతున్నారు. బాధిత మహిళలు పెండ్లి పేరు ఎత్తగానే తప్పించుకుంటున్నారు. మరీ బలవంతం చేస్తే.. వారిపైనే నిందలేసి, అక్రమ సంబంధాలు అంటగడుతున్నారు. కొందరు దుర్మార్గులు మహిళలను కడతేర్చేందుకూ వెనుకాడటం లేదు. ఇలాంటి ఘటనల్లో బాధితులు తేరుకొని పోలీసులను ఆశ్రయించడంతో నయవంచకుల పనిపడుతున్నారు. మెజార్టీ కేసుల్లో బాధితుల ఫిర్యాదుతో పక్కా ఆధారాలు సేకరించి కటకటాలకు పంపుతున్నారు పోలీసులు.
తెలిసిన వారు.. బంధువులే అధికం!
మహిళలపై జరుగుతున్న లైంగికదాడి కేసులను పరిశీలిస్తే.. ఎక్కువగా తెలిసిన వారు, సహోద్యోగులు, యజమానులు, కుటుంబసభ్యులు, బంధువులే వారిని వంచిస్తున్నట్టుగా తెలుస్తున్నది. 2022లో దాదాపు 2,126 లైంగికదాడి కేసులు నమోదు కాగా.. వీటిల్లో 2,117 కేసుల్లో బాధితురాలికి దగ్గరివారే నిందితులుగా ఉన్నారు. కేవలం 9 కేసుల్లోనే గుర్తు తెలియని వ్యక్తులు లైంగికదాడికి పాల్పడ్డారు. ఇరుగు-పొరుగు, తోటి పనివారు, యజమానులపై నమోదైన లైంగికదాడి కేసులు 332. కుటుంబసభ్యులు, బంధువులపై 237 కేసులు నమోదయ్యాయి. కొందరు బంధువులు, తెలిసిన వారే కేసులు నమోదు చేయకుండా ఆడపిల్లల గొంతు నొక్కుతున్నారు. ఈ విధానం మారాలని, బాధితులు ధైర్యంగా ఫిర్యాదు చేసే అవకాశం కుటుంబసభ్యులు సైతం కల్పించాలని పోలీసులు కోరుతున్నారు. 2021లో మొత్తం లైంగికదాడి కేసులు 2,577 నమోదు కాగా.. 2022లో 2,126 నమోదయ్యాయి. మహిళా భద్రత విషయంలో పోలీసులు చేస్తున్న విశేష కృషి ఫలితంగా దాదాపు 17శాతం కేసులు తగ్గుముఖం పట్టాయి. నిరుడు 17 కేసుల్లో 23 మందిని నిందితులుగా చేర్చి, సంబంధిత ఆధారాలు సమకూర్చి వారికి జీవితఖైదు పడేలా చర్యలు తీసుకున్నారు పోలీసులు.
జాగ్రత్తగా ఉండండి
ఇన్నాళ్లూ తెలియని వారితో జాగ్రత్తగా ఉన్నట్టే.. ఇకనుంచి తెలిసినవారితోనూ మహిళలు జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇప్పటికే ఇలాంటి కేసులపై ఉమెన్ సేఫ్టీవింగ్, షీటీమ్స్ ఆధ్వర్యంలో కాలేజీలు, వర్క్ ప్లేసులలో విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నాం. తెలిసినవారు, కుటుంబసభ్యులు, బంధువుల ద్వారా ఇలాంటి ఘ టనలు జరగడం దురదృష్టకరం. స్నేహం, ప్రేమ, పెండ్లి పేరుతో వంచించడానికి దగ్గరయ్యేవారితోనే చాలా జాగ్రత్తగా ఉండాలి. లైంగికవేధింపుల కేసు ల్లో బాధితుల పక్షాన నిలబడి మృగాళ్లను కటకటాలకు పంపుతున్నాం. పని ప్రదేశాల్లో లైంగికదాడుల నివారణకు కమిటీలను ఏర్పాటుచేశాం. సహోద్యోగులు, య జమానులు దుర్బుద్ధితో చూసినప్పుడే కమిటీలకు ఫిర్యాదు చేస్తే.. నష్టం జరగకుండా జాగ్రత్తపడొచ్చు. షీటీమ్స్, హ్యాక్ఐ యాప్, ధైర్య యాప్, డయల్ 100పై ప్రచారం కల్పిస్తున్నాం కాబట్టే.. కేసులు తగ్గుముఖం పడుతున్నాయి.
– శిఖాగోయెల్, అడిషనల్ డీజీపీ ఉమెన్ సేఫ్టీవింగ్