హైదరాబాద్ : జీహెచ్ఎంసీ పరిధిలో నిన్న సాయంత్రం నుంచి గురువారం ఉదయం వరకు ఎడతెరిపి లేకుండా వర్షం కురిసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. నిన్నటి నుంచి ఇవాళ మధ్యాహ్నం వరకు వర్షాలకు సంబంధించి 80 ఫిర్యాదులు అందాయని పేర్కొన్నారు. ఇందులో 60కి పైగా ఫిర్యాదులు పరిష్కరించబడ్డాయని చెప్పారు. మిగతా ఫిర్యాదులకు సంబంధించిన పనులు పురోగతిలో ఉన్నాయని స్పష్టం చేశారు. రాబోయే రెండు, మూడు రోజల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించిన నేపథ్యంలో.. అధికారులు పురాతన భవనాలపై దృష్టి సారించారు. ఆ భవనాల్లో నివాసముంటున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించే పనుల్లో నిమగ్నమయ్యారు.
బుధవారం రాత్రి ఎల్బీ నగర్ జోన్ పరిధిలోని సరూర్ నగర్, నాగోల్, హయత్ నగర్లలో భారీ వర్షం కురిసిన విషయం విదితమే. ఈస్ట్ ఆనంద్ బాగ్, మల్కాజ్గిరి, బోడుప్పల్, పాత బస్తీలో పలు నివాసాల్లోకి వర్షపు నీరు వచ్చి చేరింది. వరద ఉధృతి కారణంగా లింగంపల్లి బ్రిడ్జిని అధికారులు మూసివేశారు. ఆ మార్గంలో ట్రాఫిక్ను మళ్లించారు.