హైదరాబాద్, డిసెంబర్ 29 (నమస్తే తెలంగాణ) : సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో స్థిరపడాలనుకొనే విద్యార్థులకు ఇంటర్మీడియట్ స్థాయిలోనే అవకాశాలు కల్పించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని విద్యాశాఖ మంత్రి పీ సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. అందులో భాగంగా ప్రతి ఏటా 20 వేల మంది ప్రభుత్వ జూనియర్ కళాశాలల విద్యార్థులకు ఈ అవకాశం కల్పించనున్నట్టు వెల్లడించారు. ఇప్పటికే సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి, హెచ్సీఎల్ టెక్నాలజీస్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరిందని చెప్పారు.
ఈ మేరకు గురువారం మంత్రి హైదరాబాద్లోని తన కార్యాలయంలో విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, ఇంటర్ బోర్డు ఇన్చార్జి కార్యదర్శి నవీన్ మిట్టల్తో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా సబితాఇంద్రారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఇంటర్ సెకండియర్లో మ్యాథ్స్ సబ్జెక్టు విద్యార్థులకు ఫిబ్రవరిలో ఆన్లైన్ పరీక్ష నిర్వహిస్తామని వెల్లడించారు.
ఈ పరీక్షలో కనీసం 60 శాతం మారులు పొందిన విద్యార్థులకు వర్చువల్గా ఇంటర్వ్యూ నిర్వహించి, సాఫ్ట్వేర్ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారని తెలిపారు. ఎంపికైన విద్యార్థులకు ఆన్లైన్లో ఆరునెలల పాటు శిక్షణ ఇస్తారని తెలిపారు. శిక్షణ పూర్తయ్యాక హెచ్సీఎల్ టెక్నాలజీస్ కార్యాలయంలో ఆరు నెలలపాటు ఇంటర్న్షిప్ కోసం అవకాశం కల్పించి ప్రతినెలా రూ.10 వేలు ైస్టెఫండ్ అందిస్తారని చెప్పారు. ఆ తర్వాత రూ. 2.5 లక్షల వార్షిక వేతనంతో పర్మినెంట్ చేస్తారని పేర్కొన్నారు. వీరు ఉద్యోగం చేస్తూనే బిట్స్, శాస్త్ర, అమిటి యూనివర్సిటీల్లో ఇంటిగ్రేటెడ్ డిగ్రీ పూర్తి చేయొచ్చని వివరించారు. గ్రామీణ పేద విద్యార్థులకు ఇదో సువర్ణావకాశమని మంత్రి తెలిపారు.
విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
హైదరాబాద్, డిసెంబర్ 29 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో వచ్చే ఏడాది మార్చి 15 నుంచి ప్రారంభంకానున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. గురువారం హైదరాబాద్లోని తన కార్యాలయంలో ఇంటర్ వార్షిక పరీక్షల నిర్వహణపై మంత్రి అధికారులతో సమీక్షించారు. నామినల్ రోల్స్ నుంచి పరీక్షలు నిర్వహించి, ఫలితాలు వెల్లడించే వరకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించి, పటిష్ఠంగా అమలు చేయాలని సూచించారు.
పరీక్షల నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లకు తావివ్వకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని పేరొన్నారు. ప్రైవేట్ కళాశాలలకు ధీటుగా ప్రభుత్వ కాలేజీల విద్యార్థులు ఉతీర్ణత సాధించేలా ప్రత్యేక తరగతులు నిర్వహించాలని సూచించారు. సమావేశంలో విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, ఇంటర్మీడియట్ బోర్డు ఇన్చార్జి కార్యదర్శి నవీన్ మిట్టల్ తదితరులు పాల్గొన్నారు.