EVM Tampering | ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ల పనితీరు, విశ్వసనీయతపై సాధారణ పౌరులే కాదు.. మేధావులు, రాజకీయ పక్షాలూ పెద్ద ఎత్తున అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. అయినప్పటికీ, దీన్ని ఏ మాత్రం పట్టించుకోని ఎన్నికల సంఘం (ఈసీ) ఈవీఎం ఓటింగ్ వైపే మొగ్గుచూపుతున్నది. త్వరలో ఎన్నికల సీజన్ రానున్న నేపథ్యంలో ఈవీఎంల విశ్వసనీయతపై మరోసారి చర్చ మొదలైంది. ఈవీఎంల హ్యాకింగ్ కష్టమేమీకాదని పలువురు సైబర్ నిపుణులు తేటతెల్లంచేస్తున్నారు. దీనికి వారు పలు సాంకేతిక అంశాలను ఉదహరిస్తున్నారు.
(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, జూన్ 18 (నమస్తే తెలంగాణ): ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్, స్మార్ట్ లావాదేవీలు, డిజిటల్ సాధనాలు వాడే సంపన్న దేశాలు సైతం ఎలక్ట్రానిక్ ఓటింగ్ను కాదని బ్యాలట్ పత్రాలకు మారడానికి ట్యాంపరింగ్ వ్యవహారమే కారణమని ఎథికల్ హ్యాకింగ్ నిపుణులు చెప్తున్నారు. ఈవీఎంలలో ఉండే చిప్లను మార్చడం పెద్ద కష్టమైన పనికాదని, ఈవీఎంలను తయారు చేయడం దగ్గర నుంచి పోలింగ్ కేంద్రాలకు చేర్చేవరకూ ఏ క్షణమైనా, ఎలాగైనా ట్యాంపరింగ్ చేయవచ్చని అభిప్రాయపడుతున్నారు.
హ్యాకింగ్ చేయగలిగే సందర్భాలు
ట్యాంపరింగ్ ఘటనలు ఇలా..
l హైదరాబాద్కు చెందిన ఎథికల్ హ్యాకింగ్ నిపుణుడు హరిప్రసాద్, అమెరికాకు చెందిన సైబర్ నిపుణుడు అలెక్స్, నెదర్లాండ్స్కు చెందిన మరో నిపుణుడు రోప్తో కలిసి 2009లో ఓ ఈవీఎంపై ప్రయోగాలు చేశారు. ఈవీఎంను ఎలా ట్యాంపరింగ్ చేయవచ్చో ఓ వీడియోను తీసి తమ వెబ్సైట్లో పెట్టారు. అప్పట్లో ఇది వైరల్గా మారింది. అయితే, ట్యాంపరింగ్ ఎలా చేయగలిగారన్న విషయాలను పక్కనబెట్టిన అధికారులు.. ఈవీఎం ఎక్కడిదంటూ ప్రసాద్ను అరెస్టు చేసి ఆ తర్వాత విడిచిపెట్టారు.
l మధ్యప్రదేశ్లో 2017లో ఉప ఎన్నిక సందర్భంగా ఓటర్ల అవగాహన కార్యక్రమం నిర్వహించగా ఈవీఎంలో ఏ మీట నొక్కినా.. వెలుపలికి వచ్చిన స్లిప్పులన్నీ బీజేపీ గుర్తువే ఉండటం కలకలం సృష్టించింది.
l ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయవచ్చని చెబుతూ ఆమ్ఆద్మీ పార్టీ (ఆప్)కి చెందిన ఎమ్మెల్యే ఒకరు.. మే 2017లో ఢిల్లీ అసెంబ్లీలో ఓ ప్రదర్శన వేసి చూపించారు.
ఈవీఎంలను వదిలించుకొన్న దేశాలు
ఇప్పటివరకూ ఈవీఎంలను 31 దేశాలు వాడాయి. వీటిలో 30 దేశాలు ఈవీఎంల వాడకానికి పాక్షికంగా లేదా పూర్తిగా స్వస్తి పలికాయి. హ్యాకింగ్, ట్యాంపరింగ్, విశ్వసనీయత సమస్యలే దీనికి కారణం. భారత్లో తయారైన ఈవీఎంలను బోట్స్వానాలో వినియోగించగా, అధికార పార్టీకి అనుకూలంగా ఫలితాలు రాబట్టేలా ఈవీఎంలు సిద్ధం చేశారంటూ విమర్శలు వ్యక్తమయ్యాయి. ట్యాంపరింగ్ ఆరోపణలతో కజకిస్థాన్ 2011లో ఈవీఎంల వాడకాన్ని నిలిపేసింది. ఇంటర్నెట్ ఓటింగ్తో ముప్పు ఉంటుందని ఫిన్లాండ్ ఈవీఎంల వాడకాన్ని నిషేధించింది. నెదర్లాండ్స్, రొమేనియా, కెనడా, ఐర్లాండ్, దక్షిణకొరియా, యూకే, స్కాట్లాండ్, బెల్జియం, సింగపూర్, బంగ్లాదేశ్, ఫ్రాన్స్ సహా సాంకేతికతకు అడ్డాలుగా చెప్పుకొనే జపాన్, జర్మనీ కూడా ఈవీఎంల వినియోగంపై వెనక్కి తగ్గాయి. కాగా, ఈవీఎంల విశ్వసనీయతను ప్రశ్నిస్తూ 2009 కంటే ముందు కాంగ్రెస్ హయాంలో బీజేపీ పెద్దయెత్తున ఉద్యమాలే చేసింది. ‘కెన్ వుయ్ ట్రస్ట్ అవర్ ఈవీఎం’ పేరిట బీజేపీ ఎంపీ జీవీఎల్ నర్సింహారావు ఓ పుస్తకాన్నే రాశారు. బీజేపీ కురువృద్ధుడు ఎల్కే అద్వానీ సహా పలువురు సీనియర్ బీజేపీ నేతలు ఈవీఎంలను తప్పుబట్టారు.
ఆర్వీఎంలపై రగడ
అసలే ఈవీఎంలపై సర్వత్రా అనుమానాలు కొనసాగుతుండగా.. రానున్న లోక్సభ ఎన్నికల్లో రిమోట్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లను (వేరే ప్రాంతాల నుంచి ఓటు వేయడం-ఆర్వీఎం) ప్రవేశపెట్టాలని ఈసీ యోచిస్తున్నది. ఇందులో భాగంగా గత జనవరి 16న దీనిపై చర్చించేందుకు దేశంలోని ఎనిమిది జాతీయ, 57 రాష్ట్రీయ రాజకీయ పార్టీ నేతలను ఆహ్వానించింది. అయితే, ఎన్నికల్లో ఆర్వీఎంలను తీసుకురావడాన్ని మెజార్టీ విపక్షాలు వ్యతిరేకించాయి. ఈవీఎంలు, రిమోట్ ఓటింగ్కు సంబంధించి తమ అనుమానాలకు ఈసీ జవాబివ్వాలని విజ్ఞప్తి చేశాయి.