హైదరాబాద్, ఫిబ్రవరి 11 (నమస్తే తెలంగాణ) : ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) పరీక్షలో ఈ సారి జనరల్ క్యాటగిరీ(ఓసీ సామాజికవర్గం) అభ్యర్థులు భారీగా ఫెయిలయ్యారు. ఏకంగా 69% మంది టెట్ పరీక్షలో గట్టెక్కలేకపోయారు. కేవలం 31% అభ్యర్థులు మాత్రమే క్వాలిఫై అయ్యారు. మరీ ముఖ్యంగా ఓసీ సామాజికవర్గం నుంచి 27% మహిళా అభ్యర్థులు మాత్రమే పాసయ్యారు. టెట్ పరీక్షలో 150 మార్కులుంటాయి. జనరల్ క్యాటగిరీ అభ్యర్థులు 90మార్కులు(60%) సాధిస్తేనే క్వాలిఫై అవుతారు. బీసీలు 75(50%), ఎస్సీ, ఎస్టీలు 60 (40%) మార్కులు సాధిస్తే క్వాలిఫై అయినట్టు. టెట్కు ఈ సారి 24,346 మంది ఓసీ అభ్యర్థులు దరఖాస్తు చేశారు. వీరిలో కేవలం 7,582(31.14%) మంది మాత్రమే క్వాలిఫై అయ్యారు. కొందరు ఓసీ అభ్యర్థులు 89 మార్కులు సాధించి, ఒకే ఒక్క మార్కు తేడాలో అర్హత సాధించలేకపోయారు. 52 ఏండ్ల వయస్సున్న ఓసీ వర్గానికి చెందిన సర్కార్ టీచర్ 89 మార్కులు తెచ్చుకుని క్వాలిఫై కాలేకపోయారు. 50 ఏండ్లకు పైబడిన వారే క్వాలిఫై కాలేదని ఉపాధ్యాయ సంఘాలు అంటున్నాయి.
27వేల మంది టీచర్లకు టెట్ గండం పొంచి ఉంది. వీరంతా తాజా టెట్ పరీక్షలో పాస్ కాలేకపోయారు. దీంతో ఈ టీచర్లను టెట్ టెన్షన్ పట్టిపీడిస్తున్నది. జనవరిలో నిర్వహించిన టెట్కు 65,605 మంది ఇన్ సర్వీస్ టీచర్లు హాజరయ్యారు. వీరిలో 37,893 మంది క్వాలిఫై అయ్యారు. 27,712 మంది క్వాలిఫై కాలేదు. టెట్పై 2025 సెప్టెంబర్ 30న సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. రెండేండ్లల్లో టెట్ పాస్కాని వారంతా పాస్ కావాలని సుప్రీంకోర్టు గడువు విధించింది. అంటే 2027 సెప్టెంబర్ 30లోపు అంతా టెట్ పాస్ కావాలి. లేదంటే ఉద్యోగం ఊడుతుంది. ఈ తీర్పు తర్వాత ఈ ఏడాది జనవరిలో ఒక టెట్ పరీక్ష ముగిసింది. ఈ ఏడాది జూన్/జూలైలో ఒక టెట్, 2027 జనవరిలో రెండో టెట్, జూన్/ జూలైలో మూడో టెట్ పరీక్ష జరుగనున్నది. ఇప్పుడు పాస్ కాని వారు మిగిలిన టెట్ పరీక్షల్లో తప్పకుండా పాస్కావాల్సి ఉంటుంది.
