హైదరాబాద్, ఫిబ్రవరి 14 (నమస్తే తెలంగాణ): ఎవరికో పుట్టిన పిల్లలకు పేరు పెట్టినట్టు.. కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలకు సీఎం రేవంత్రెడ్డి సభ పెట్టుకోవటం సిగ్గుచేటని బీఆర్ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ పేర్కొన్నారు. గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇలాంటి చిల్లర ప్రచారం చేసుకోలేదని, అది రేవంత్ రెడ్డికే సాధ్యమైందని విమర్శించారు. రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తానని అధికారంలోకొచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రెండు నెలలు దాటినా ఇప్పటికీ ప్రత్యేక కార్యాచరణ చేపట్టలేదని దుయ్యబట్టారు.
60 ఉద్యోగాలకు ఆర్థిక శాఖ అనుమతిచ్చిందని, ఇంకా 1,99,940 ఉద్యోగాలకు ఆర్థిక శాఖ నుండి ఎప్పుడు అనుమతి ఇస్తావో కార్యాచరణ ప్రకటించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలకు ఎల్బీ స్టేడియంలో సభ పెట్టుకొని రాజకీయాలు మాట్లాడటం బంద్ చేయాలని కోరారు. కేసీఆర్ ఇచ్చిన నోటిఫికేషన్ ద్వారానే 16,027 పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికయ్యామన్న విషయం అభ్యర్థులకు తెలుసునని తెలిపారు. కేసీఆర్ ఇచ్చిన నోటిఫికేషన్లను తానే ఇచ్చినట్టుగా భావించి.. సీఎం రేవంత్రెడ్డి రెండు లక్షల ఉద్యోగాల హామీని మరిచిపోయారని ఎద్దేవా చేశారు. త్వరలో ఉద్యోగాల భర్తీ కార్యాచరణ ప్రకటించకపోతే సీఎంను నిరుద్యోగులు వెంటబడి నిలదీయడం ఖాయమని గెల్లు శ్రీనివాస్ హెచ్చరించారు.