CM Revanth Reddy | నారాయణపేట/కోస్గి, ఫిబ్రవరి 21: వారం రోజుల్లో మరో రెండు గ్యారెంటీలను అమలుచేస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించారు. నారాయణపేట జిల్లా కోస్గి పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన బహిరంగ సభలో రేవంత్రెడ్డి మాట్లాడుతూ.. వారం రోజుల్లో రూ.500కే గ్యాస్ సిలిండర్, తెల్లరేషన్ కార్డుదారులందరికీ 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు అమలు చేస్తామని వెల్లడించారు. మార్చి 15లోగా అందరికీ రైతుబంధు అందజేస్తామని తెలిపారు. రైతు రుణమాఫీ బాధ్యత తనదేనని చెప్పారు. 2014 ఎన్నికల సందర్భంగా బీజేపీ అధికారంలోకి వస్తే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయహోదా కల్పిస్తామంటూ ప్రధాని మోదీ ఇచ్చిన హామీ ఇప్పటికీ అమలు కాలేదని విమర్శించారు. రాష్ట్రంలో నలుగురు బీజేపీ ఎంపీలు ఉన్నప్పటికీ ఐదేండ్లలో నాలుగు పైసలు కూడా తీసుకురాలేదని దుయ్యబట్టారు. గత పదేండ్లలో బీజేపీ ప్రభుత్వం ఒక ప్రాజెక్టు కానీ, పరిశ్రమ కానీ రాష్ర్టానికి ఇవ్వలేదని, ఏ మొహం పెట్టుకొని ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు.
రానున్న ఐదేండ్లల్లో ప్రతి ఎకరాకూ కృష్ణా జలాలను అందిస్తామని హామీ ఇచ్చారు. పార్లమెంట్ ఎన్నికల్లో కొడంగల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థికి 50 వేల మెజార్టీ అందిస్తే మరో రూ.5 వేల కోట్ల అభివృద్ధి నిధులను మంజూరు చేస్తామని చెప్పారు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి మాట్లాడుతూ.. రాజీవ్భీమా పథకంలో భాగంగా ఏడు టీఎంసీలను తరలించేందుకు రూ.2,945 కోట్లతో నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని మంజూరు చేశామని, దీనిద్వారా మక్తల్, నారాయణపేట, కొడంగల్ నియోజకవర్గాలకు ప్రయోజనం చేకూరుతుందని వివరించారు. రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మాట్లాడుతూ.. అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. రూ.4 వేల కోట్ల అభివృద్ధి పనులతో కొడంగల్ నియోజకవర్గ రూపురేఖలు మారనున్నాయని పేర్కొన్నారు. అనంతరం మహబూబ్నగర్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఏఐసీసీ ప్రత్యేక ఆహ్వానితుడు వంశీచందర్రెడ్డి పోటీ చేస్తారని సీఎం రేవంత్రెడ్డి ప్రకటించారు. కార్యక్రమంలో ఢిల్లీలో తెలంగాణ ప్రత్యేక ప్రతినిధి మల్లు రవి, వికారాబాద్, నారాయణపేట జెడ్పీ చైర్మన్లు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
కొడంగల్కు 4,369.14 కోట్లు
బుధవారం హెలికాప్టర్లో కోస్గి పట్టణానికి చేరుకున్న రేవంత్రెడ్డి.. రూ.4,369.14 కోట్లతో కొడంగల్ నియోజకవర్గంలో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం ఫుట్బాల్ గ్రౌండ్లో ఏర్పాటుచేసిన మహిళా స్వయం సహాయక సంఘాల ఆత్మీయ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. విద్యార్థుల యూనిఫామ్స్ కుట్టే పనిని మహిళా సంఘాలకు అప్పగిస్తామని, వారికి కొత్త కుట్టుమిషన్లు ఇస్తామని ప్రకటించారు. ఐకేపీ ద్వారా రుణాలు ఇవ్వడమే కాకుండా, పంటలన్నింటినీ ఐకేపీ ద్వారా కొనుగోలు చేస్తామని చెప్పారు. అనంతరం రూ.177.53 కోట్ల చెక్కును 3,083 మహిళా సంఘాల సభ్యులకు అందజేశారు. కోస్గి పట్టణానికి నారాయణరెడ్డి అందించిన అంబులెన్స్ను ప్రారంభించారు. కార్యక్రమంలో స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్, మంత్రులు దామోదర రాజనర్సింహ, ఉత్తమ్కుమార్రెడ్డి, జూపల్లి కృష్ణారావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీఎస్ శాంతికుమారి, ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు.
మార్చి 3న 500కే గ్యాస్కు శ్రీకారం?
హైదరాబాద్, ఫిబ్రవరి 21(నమస్తే తెలంగాణ): ఆరు గ్యారెంటీల్లో భాగమైన మహాలక్ష్మి పథకంలోని రూ.500కే గ్యాస్ సిలిండర్ హామీని అమలుచేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నది. మార్చి 2 లేదా 3న ఈ పథకాన్ని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలిసింది. ఈ పథకం అమలు కోసం పౌరసరఫరాల శాఖ ప్రత్యేకంగా పోర్టల్ను తయారుచేస్తున్నట్టు సమాచారం. ఒకవేళ పోర్టల్ సిద్ధమై అన్నీ కుదిరితే ఈ నెలాఖరులోనే ప్రారంభించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. సబ్సిడీ మొత్తాన్ని నేరుగా వినియోగదారులకే డీబీటీ ద్వారా వారి ఖాతాలో జమ చేసేందుకు పౌరసరఫరాల శాఖ కసరత్తు చేస్తున్నది. ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ ధర రూ.955. అయితే రూ.500కే గ్యాస్ ఇవ్వనున్న నేపథ్యంలో వినియోగదారులు అదనంగా చెల్లించిన రూ.455ను వారి బ్యాంక్ ఖాతాల్లో ప్రభుత్వం జమ చేయనున్నది. ఇందుకోసం రూపొందించే ప్రత్యేక పోర్టల్లో ఆ వివరాలన్నీ పొందుపరచనున్నది. రాజస్థాన్లో సబ్సిడీ గ్యాస్ పథకానికి ఇలాంటి విధానాన్నే అమలుచేస్తున్నారు. తెల్ల రేషన్కార్డు ఉన్నవారందరికీ సబ్సిడీ గ్యాస్ సిలిండర్ అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో సుమారు 90 లక్షల తెల్ల రేషన్కార్డులు ఉన్నాయి. ఇందులో గ్యాస్ కనెక్షన్ ఉన్నవారు 64 లక్షల మందే ఉన్నట్టు పౌరసరఫరాల శాఖ లెక్కలు చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ పథకాన్ని ఎంతమందికి అమలు చేస్తారనే దానిపై స్పష్టత రావాల్సి ఉన్నది.