భద్రాద్రి కొత్తగూడెం : భద్రాచలంలో భారీ స్థాయిలో గంజాయి పట్టుబడింది. రూ. 1.18 కోట్ల విలువ చేసే 594 కేజీల గంజాయిని పోలీసులు సీజ్ చేశారు. గంజాయిని తరలిస్తున్న వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ సందర్భంగా ఏఎస్పీ బీ రోహిత్ రాజ్ మాట్లాడుతూ.. ఆదివారం రోజు భద్రాచలం ఫారెస్ట్ చెక్ పోస్టు వద్ద ఎస్ఐ మధు ప్రసాద్ ఆధ్వర్యంలో తనిఖీలు జరిగాయన్నారు. అనుమానాస్పదస్థితిలో వెళ్తున్న ఓ రెండు కార్లను పోలీసులు ఆపడంతో.. అందులో ఉన్న వ్యక్తులు పరారీ అయ్యారు. ఒక్కరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక కార్లలో ఉన్న 594 కేజీల గంజాయిని సీజ్ చేశారు. పట్టుబడ్డ వ్యక్తిని సారపాకకు చెందిన అన్వేష్గా గుర్తించారు.
ఒడిశా నుంచి చెన్నైకి గంజాయిని తరలిస్తున్నట్లు అన్వేష్ పోలీసులకు తెలిపాడు. రాము, మహేందర్ గంజాయిని స్మగ్లింగ్ చేస్తున్నట్లు పేర్కొన్నాడు. తమిళనాడులో జయ కుమార్ అనే వ్యక్తికి గంజాయిని విక్రయిస్తున్నట్లు తేలింది. పరారైన కుమార్, ప్రవీణ్ కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.