మహబూబ్నగర్, సెప్టెంబర్ 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): గూడు లేని నిరుపేదలకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా కట్టిస్తున్న డబుల్ బెడ్రూం ఇండ్లను ఓ బీజేపీ నేత ఫేక్ డ్యాక్యుమెంట్లు సృష్టించి లక్షల రూపాయలకు అమ్ముకొన్న ఉదంతం పాలమూరు జిల్లాలో కలకలం రేపింది. పేదల బలహీనతను ఆసరాగా చేసుకొని 40 మందికి నకిలీ ప్రొసీడింగ్స్ ఇచ్చి దాదాపు రూ.60 లక్షలు కుచ్చుటోపీ పెట్టాడు. బాధితుల ఫిర్యాదుతో ఎట్టకేలకు కటకటాల్లోకి వెళ్లాడు. ఎస్పీ వెంకటేశ్వర్లు వెల్లడించిన వివరాల ప్రకారం.. జిల్లాకేంద్రానికి చెందిన బీజేపీ పట్టణ మైనార్టీ మోర్చా అధ్యక్షుడు సయ్యద్ హసన్, ఎలక్ట్రికల్ షాపులో పనిచేస్తున్న జాఫర్, మెడికల్ అసోసియేషన్లో పనిచేస్తున్న అమీర్, రియల్ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న కమ్మర్తీ వెంకటయ్య, మెహరూన్, ఇంద్రజ ముఠాగా ఏర్పడ్డారు. డబుల్ బెడ్రూం ఇండ్లు ఇప్పిస్తమంటూ వీరు అమాయకులను నమ్మిస్తుంటారు. ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి సుమారు 40 మంది నుంచి దాదాపు రూ.60 లక్షలు వసూలు చేశారు. డబ్బులు తీసుకొని ఇండ్లు ఇవ్వకపోవడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించగా, ప్రధాన నిందితుడు సయ్యద్ హసన్ సహా ఆరుగురిని అరెస్టు చేశారు. వీరి వద్ద నకిలీ డాక్యుమెంట్లు, రబ్బర్ స్టాంపులు, రూ.13.60 లక్షలు, కారు, కంప్యూటర్ను పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. సయ్యద్ హసన్ కేంద్ర మంత్రి కిషన్రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరడం విశేషం.